శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 జులై 2020 (11:13 IST)

కుమార్తెల చదువు కోసం విరామం లేని కొలువు ... నాన్‌స్టాప్‌గా 38 యేళ్లపాటు సర్వీసు

సాధారణంగా కూలీ పని చేసే వ్యక్తికి కూడా వారంలో ఒక రోజు సెలవు ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారంలో రెండు రోజు రోజులు లేదా ఒక రోజు సెలవు ఉంటుంది. అలాగే, ప్రతి కార్మికుడికి వారంలో ఒక రోజు ఖచ్చితంగా సెలవు ఉంటుంది. ఎందుకంటే వారమంతా శ్రమించి ఆ ఒక్క రోజు కుటుంబంతో హాయిగా గడపాలని భావిస్తారు. కానీ బ్రిటన్‌లో ఓ భారత సంతతి వ్యక్తి ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ఏకంగా 38 యేళ్లు (13,416 రోజులు) పని చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బ్రిటన్‌లోని సముద్ర తీర పట్టణం షిర్లేలో 1982 అక్టోబర్‌లో చిన్న షాపు ప్రారంభించిన రాయ్ ఖర్బందా అనే భారతీయ బ్రిటిషర్‌ ఈ నెల 16న తొలిసారిగా షాపును బంద్‌ పెట్టాడు. రిటైర్మెంట్‌ తీసుకుంటానని ప్రకటించారు. 
 
దీంతో ఖర్బందా రిటైర్మెంటును స్థానిక ప్రజలు ఘనంగా నిర్వహించారు. కొందరు భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఖర్బందాను ఇంటర్వ్యూ చేయటానికి బ్రిటిష్‌ మీడియా పోటీ పడింది. తన కూతుళ్ల చదువుకోసమే ఇంతకాలం కష్టపడ్డానని, చదువుకు మించినది ఏదీ లేదని తెలిపారు. పెళ్లయిన 39 యేళ్ళ తర్వాత భార్య శశితో కలిసి హాలీడే విహారానికి వెళ్లేందుకు ఆయన ప్రణాళిక వేసుకుంటున్నారు. 
 
'1982 నుంచి నేను నా భార్యతోఎప్పుడూ ఎక్కువసమయం గడుపలేదు. నేను షాపులో ఉంటే, త‌ను ఇంట్లో ఉండేది. నాది కేవలం షాపు మాత్రమే కాదు. కమ్యూనిటీ సెంటర్‌లాగా కూడా సేవలు అందించింది. సొంతానికి సంపాదిస్తూనే ఇతరులకు సాయం చేయాలన్నదే నా సిద్ధాంతం' అని ఖర్బందా చెప్పుకొచ్చారు.