1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 31 మార్చి 2018 (18:26 IST)

పాకిస్థాన్‌లో సొంత పట్టణానికి మలాలా: తిరిగి వచ్చేస్తానంటూ.. కంటతడి

నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్ రజాయ్.. స్వదేశానికి వెళ్లారు. బాలికల విద్య కోసం పోరాటం చేసే ఆమెపై ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఉగ్రదాడిలో చావు అంచుల వరకు వెళ్లిన సాహస బాలిక మలాలా.. మాతృదేశం పాకి

నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్ రజాయ్.. స్వదేశానికి వెళ్లారు. బాలికల విద్య కోసం పోరాటం చేసే ఆమెపై ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఉగ్రదాడిలో చావు అంచుల వరకు వెళ్లిన సాహస బాలిక మలాలా.. మాతృదేశం పాకిస్థాన్‌లో అడుగుపెట్టింది.

తన తల్లిదండ్రులతో కలిసి ఇస్లామాబాద్‌లోని బెనజీర్ భుట్టో అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు భారీ భద్రత కల్పించారు. భద్రతా కారణాలతో మలాలా పర్యటన వివరాలను గోప్యం వుంచారు. నాలుగు రోజుల పాటు ఆమె పాకిస్థాన్‌లో పర్యటిస్తారని తెలుస్తోంది. ఈ సందర్భంగా పాక్ ప్రధాని షాహిద్ ఖకాన్ అబ్బాసీతో మలాలా భేటీ అవుతారని తెలుస్తోంది. 
 
2012 అక్టోబర్ 9న మలాలాపై తాలిబన్ ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన మలాలాను.. మెరుగైన చికిత్స కోసం ఆమె తల్లిదండ్రులు ఆమెను బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌కు తీసుకెళ్లారు. అక్కడే ఆమె తన చదువును కొనసాగించారు. అప్పటి నుంచి ఆమె బ్రిటన్‌లోనే వుంటున్నారు. ఇక బాలిక విద్య, మానవ హక్కుల కోసం చేసిన పోరాటానికిగాను 2014లో మలాలా నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు.
 
ఇదిలా ఉంటే, నోబెల్ శాంతి పురస్కారాన్ని అందుకున్న తర్వాత స్వదేశంలో కాలుపెట్టిన మలాలా, తన సొంత పట్టణమైన స్వాత్ లోయలోని మింగోరాకు వెళ్లారు. అక్కడ తన పూర్వీకుల ఇంటిని సందర్శించి, భావోద్వేగానికి గురై కంటతడిపెట్టారు. పాక్ పర్యటనలో మలాలా తాను చదువుకున్న పాఠశాలను కూడా సందర్శిస్తారు. ఈ సందర్భంగా మలాలా మాట్లాడుతూ..  బ్రిటన్‌లో తన చదువు పూర్తికాగానే తాను మళ్లీ పాకిస్థాన్‌కు వచ్చేస్తానని చెప్పారు. పాక్‌లో మహిళా విద్య కోసం తన ప్రచారాన్ని, పోరాటాన్ని కొనసాగిస్తానని పునరుద్ఘాటించారు.