1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 16 సెప్టెంబరు 2017 (16:29 IST)

అమెరికా నేతలకు ధైర్యమే కాదు నిద్రలేకుండా చేస్తా : కిమ్ జాంగ్ ఉన్

ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ మరోమారు గర్జించారు. అగ్రరాజ్యాధినేతలకు కంటిమీదకునుకు లేకుండా చేస్తామని, వారికి ఉన్న కొద్దిపాటి ధైర్యం కూడా లేకుండా చేస్తామని ఆయన హెచ్చరించారు. ప్రపంచ దేశాల హెచ్చరికల

ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ మరోమారు గర్జించారు. అగ్రరాజ్యాధినేతలకు కంటిమీదకునుకు లేకుండా చేస్తామని, వారికి ఉన్న కొద్దిపాటి ధైర్యం కూడా లేకుండా చేస్తామని ఆయన హెచ్చరించారు. ప్రపంచ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఉత్తర కొరియా మరోసారి జపాన్ భూభాగం మీదుగా అణు క్షిపణిని ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈ ప్రయోగం అనంతరం కిమ్ జాంగ్ స్థానిక మీడియాతో మాట్లాడారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమెరికాతో సమానంగా తమ సైనిక సామర్థ్యం ఉండాలనేదే తమ లక్ష్యమన్నారు. సైనిక సామర్థ్యం సమానంగా ఉంటేనే... అమెరికాను నిలువరించగలుగుతామని పునరుద్ఘాటించారు. ఉత్తర కొరియా అంతు చూస్తామని అమెరికా బెదిరిస్తోందని, అందుకే అమెరికాను ధీటుగా ఎదుర్కొనేందుకే, తమ సైనిక సామర్థ్యాన్ని పెంచుకుంటున్నామన్నారు. తమపై సైనిక చర్య తీసుకుంటామని అనే ధైర్యం కూడా అమెరికా నేతలకు లేకుండా చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. 
 
ఇకపోతే.. ఇటీవల ఉత్తర కొరియా జరిపిన హైడ్రోజన్ బాంబును విశ్లేషించిన అమెరికన్ నిపుణులు, గతంలో జరిపిన పరీక్షలతో పోలిస్తే, ఇది చాలా పక్కాగా జరిగిందని, ఖచ్చితత్వం కూడా అధికమని అభిప్రాయపడ్డారు. ఈ బాలిస్టిక్ మిసైల్ ప్రయోగం విజయవంతం కావడంతో ఏ క్షణమైనా అమెరికాపై దాడి జరిపేందుకు కిమ్ సిద్ధంగా ఉన్న సంకేతాలు వెలువడ్డాయని మాజీ సైనికాధికారులు పేర్కొన్నారు. 
 
దాదాపు 2,300 మైళ్ల ఎత్తులో ప్రయాణించిన మిసైల్ పసిఫిక్ మహాసముద్రంలో పడిందని గుర్తు చేసిన వారు, అమెరికా అధీనంలో ఉన్న గువామ్ ప్రాంతానికి అత్యంత సమీపానికి ఇది వచ్చిందని పేర్కొన్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తమపై దాడికి దిగే సత్తా కిమ్ సమకూర్చుకున్నారని, గువామ్‌తో పాటు యూఎస్‌లోని ప్రధాన భూభాగాలపైకీ కిమ్ వదిలే క్షిపణులు చేరుకోవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.