శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 నవంబరు 2020 (09:34 IST)

ఆఫ్ఘనిస్థాన్‌లో బాంబు పేలుడు.. 13మంది మృతి.. విద్యార్థులే ఎక్కువ

ఒకవైపు కరోనా.. మరోవైపు ప్రకృతీ వైపరీత్యాలతో ప్రపంచ జనాలు నానా తంటాలు పడుతుంటే.. ఉగ్రమూకలు వేరొక వైపు రెచ్చిపోతున్నారు. తాజాగా సెంట్రల్‌ ఆఫ్ఘనిస్తాన్‌లో మంగళవారం రోడ్డు పక్కన బాంబు పేలిన ఘటనలో 13 పౌరులు సహా ఓ ట్రాఫిక్‌ పోలీసు మరణించారని అధికారులు తెలిపారు. బామియన్‌ నగరంలో మధ్యాహ్నం జరిగిన పేలుడులో 45 మంది గాయపడినట్లు అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిధి తారిక్‌ అరియన్‌ తెలిపారు. 
 
పలు దుకాణాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. రెండు బాంబులు పేలినట్లు పోలీస్‌ చీఫ్‌ ప్రతినిధి మహ్మద్‌ రెజా యూసుఫీ తెలిపారు. వేలాదిమంది పర్యాటకులు సందర్శించే బమియాన్ లో పేలుళ్లు జరగడం మొదటిసారి. ఈ పేలుళ్లకు కారణమెవరనేది ఇంకా ఎవరూ ప్రకటించలేదు. 
 
పేలుళ్లలో క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. తాలిబన్‌ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్‌ ఈ ఘటనతో తమకు సంబంధం లేదని ప్రకటించారు. ఇటీవల జరిగిన దాడులకు ఐఎస్‌ అనుబంధ సంస్థ బాధ్యత వహించింది. ఈ దాడిలో కనీసం 50 మంది మృతి చెందగా.. ఇందులో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులున్నారు.