బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వాసుదేవన్
Last Updated : మంగళవారం, 12 మార్చి 2019 (18:34 IST)

అక్కడ ఒక్కసారి నొక్కినందుకు నెలకు రూ.1.62 లక్షల జీతం

టార్గెట్లు, ఓవర్ టైమ్‌లు పేరిట విపరీతమైన పనులు చేయించుకునే సంస్థలున్న ఈ రోజుల్లో.. ఓ సంస్థ ఏ పని చేయని ఉద్యోగికి నెలకు రూ.1.62 లక్షల జీతం ఇచ్చేందుకు సిద్ధమైంది. వినడానికి వింతగానే ఉన్నా.. ఇది నిజం. ఈ ఉద్యోగికి కేవలం జీతం మాత్రమే కాదు, సెలవులు, ఇతర ఉద్యోగులకు లభించే అన్ని రకాల ప్రయోజనాలు కూడా లభిస్తాయి. 
 
స్వీడెన్‌లో గోథెన్బర్గ్ నగరంలో ఓ ఎక్స్‌పరిమెంటల్ ఆర్ట్ ప్రాజెక్ట్‌ సంస్థ ఓ రైల్వే స్టేషన్‌ నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం నిధులు సమకూర్చుతూండగా.. ఈ రైల్వే స్టేషన్లో పనిచేసేందుకు ఆ సంస్థ ఓ ఉద్యోగిని నియమించాలని నిర్ణయించింది. అయితే, ఆ ఉద్యోగి అక్కడ ఏ పనీ చేయనక్కర్లేదు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేవారిలో ఒకరిని లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. 
 
ఈ ఉద్యోగానికి ఎంపికయ్యే వ్యక్తి రైల్వే స్టేషన్‌లో పనిచేయాలి. రోజు మొత్తంలో అతను చేయాల్సిన ఒకే ఒక్క పని.. ఆ స్టేషన్‌లో ఏర్పాటుచేసిన ఓ గడియారం బటన్ నొక్కడం. ఆ బటన్ నొక్కిన వెంటనే స్టేషన్‌లో ఉండే ఫ్లోరోసెంట్ బల్బులన్నీ వెలుగుతాయి. పనివేళలు ముగిసిన తర్వాత మళ్లీ ఆ బటన్ నొక్కి, బల్బులు ఆపేయడం. 
 
అంతే ఆ రోజుకు అతని డ్యూటీ పూర్తవుతుంది. అతను గడియారం బటన్ నొక్కిన తర్వాత ఎక్కడికైనా తిరిగి రావచ్చు. బోరు కొడితే ఆ ఉద్యోగం వదిలి మరెవ్వరినైనా నియమించుకునే స్వేచ్ఛ కూడా అతనికి ఉంటుంది లేదా పదవీ విరమణ వయస్సు వరకు అదే ఉద్యోగంలో కొనసాగవచ్చు. పదవీ విరమణ తర్వాత అతనికి పింఛన్ కూడా లభిస్తుంది. 
 
కాగా... ఈ పని లేని ఉద్యోగం ఐడియా 2017లో శ్రీకారం చుట్టబడింది. స్వీడెన్‌కు చెందిన పబ్లిక్ ఆర్ట్ ఏజెన్సీ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అడ్మినిస్ట్రేషన్ అప్పట్లో ఓ పోటీ నిర్వహించింది. గోథెన్బర్గ్ రైల్వే స్టేషన్‌‌కు ప్రత్యేకంగా నిలిచిపోయే గొప్ప ఐడియా ఇవ్వాలని ప్రపంచంలోని ఆర్టిస్టులందరికీ పిలుపునివ్వగా... విజేతలకు 750,000 డాలర్లు ( భారతదేశ కరెన్సీలో రూ.5,22,75,000) బహుమతి కూడా ప్రకటించింది. 
 
ఈ సందర్భంగా సిమోన్ గోల్డెన్ అండ్ జాకబ్ సెనైబీ అనే సంస్థ ఈ పనిలేని ఉద్యోగం ఐడియా ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఐడియాను అమలు పరిచేందుకు నిర్వాహకులు సిద్ధం అవుతున్నారు. అయితే, దీనిపై ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ ప్రాజెక్టును ప్రజాధనంతో చేపడుతున్నారని మర్చిపోయి ఏ పనీ చేయని ఉద్యోగికి భారీ మొత్తాన్ని జీతంగా ఇవ్వడమంటే నిధులను దుర్వినియోగం చేసినట్లేనని మండిపడుతున్నారు.