శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By కుమార్ దళవాయి
Last Modified: గురువారం, 4 ఏప్రియల్ 2019 (17:15 IST)

మోదీకి యూఏఈ అత్యున్నత పురస్కారం... ఎందుకో తెలుసా?

అంతర్జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు ఖలీఫా బిన్ జాయేద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ గురువారం ప్రధాని మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం అయిన 'జాయెద్' మెడల్‌ను ప్రకటించారు. ఈ అవార్డు అధ్యక్షులు, రాజులు, దేశాధినేతలకు మాత్రమే ప్రకటించబడుతుంది. ప్రధాని మోదీ భారత్, యూఏఈల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు చేసిన కృషికి ఆయనకు ఈ గుర్తింపు లభించింది.
 
ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసే విషయంలో ప్రధాని మోదీ ముఖ్య భూమిక పోషించారని యూఏఈ కొనియాడింది. ఈ మేరకు అబూదాబీ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ సైనిక దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మహ్మద్ బిన్ జాయేద్ ట్విటర్‌లో ఇవాళ ఓ సందేశాన్ని పోస్టు చేశారు. 
 
ఇంతకుముందు ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని (ఆర్డర్ ఆఫ్ జాయేద్) 2007లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, 2010లో బ్రిటన్ రాణి ఎలిజబెత్, 2016లో సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబ్దులజీజ్ అల్ సౌద్, 2018లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ పొందారు. కాగా అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరచడం, ఆర్ధిక అభివృద్ధి కోసం చేస్తున్న కృషికిగాను ప్రధాని మోదీని దక్షిణ కొరియా ఇటీవల సియోల్ శాంతి పురస్కారంతో సత్కరించిన సంగతి తెలిసిందే.