గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2018
Written By pnr
Last Updated : ఆదివారం, 27 మే 2018 (23:07 IST)

వాట్సన్ సిక్సర్ల వర్షం.. ఐపీఎల్ 2018 విజేత చెన్నై సూపర్ కింగ్స్

అందరూ ఊహించినట్టుగానే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మరోమారు చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో పరాభవం ఎదురైంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆదివారం రాత్రి ఐపీఎల్ 2018 ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో సీఎస్కే ఆల

అందరూ ఊహించినట్టుగానే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మరోమారు చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో పరాభవం ఎదురైంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆదివారం రాత్రి ఐపీఎల్ 2018 ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో సీఎస్కే ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ (ఆస్ట్రేలియా) సిక్సర్ల వర్షం కురిపించాడు. ఫలితంగా ధోనీ గ్యాంగ్ 179 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని మరో 9 బంతులు మిగిలివుండగానే సునాయాసంగా ఛేదించింది. ఫలితంగా ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ విజేతగా అవతరించింది. 
 
ఈ మ్యాచ్‌లో చెన్నై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో హైదరాబాద్ తొలుత బ్యాటింగ్‌కి దిగింది. అయితే ఎంగిడి వేసిన రెండో ఓవర్ ఐదో బంతికి అనవసర పరుగుకు ప్రయత్నించి గోస్వామి(5) రనౌట్ అయ్యాడు. దీంతో 2 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ ఒక్క వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది. ఆ తర్వాత చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేశారు. ప్రధానంగా లుంగి ఎంగిడి తాను వేసిన నాలుగో ఓవర్‌ని మేడిన్ చేశాడు. 
 
ఆ తర్వాతి రెండు ఓవర్లలో విలియమ్‌సన్, ధవన్‌లు బౌండరీలు కొట్టడంతో పవర్ ప్లేలో సన్‌రైజర్స్ వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది. ఈ దశలో విలియమ్‌సన్, ధవన్‌ల జోడీ జట్టుకు అండగా నిలిచేందుకు ప్రయత్నించింది. అయితే రవీంద్ర జడేజా వేసిన 9వ ఓవర్ మూడో బంతికి ధవన్(26) భారీ షాట్‌కు ప్రయత్నించి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన షకీబ్‌తో కలిసి కేన్ స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరు కలిసి మూడో వికెట్‌కి 37 పరుగులు జోడీంచారు.
 
అయితే కర్న్ శర్మ వేసిన 13వ ఓవర్‌లో కేన్ (47) స్టంప్ ఔట్ అయ్యాడు. ఈ దశలో యూసుఫ్ విజృంభించాడు. 25 బంతుల్లో 4 ఫోర్లు, రెండు సిక్సులు బాది జట్టు భారీ స్కోర్ సాధించేందుకు కృషి చేశాడు. మ్యాచ్ ఆఖర్లో బ్రాత్‌వైట్ మెరుపులు మెరిపించడంతో సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 178 పరుగులు చేసింది. చెన్నై బౌలింగ్‌లో ఎంగిడి, ఠాకూర్, కర్న్, బ్రావో, జడేజా తలో వికెట్ తీశారు.
 
ఆ తర్వాత 179 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. ముఖ్యంగా. ఆ జట్టు ఓపెనర్ షేన్ వాట్సన్ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. 57 బంతులు ఎదుర్కొన్న వాట్సన్ 11 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 205.26 స్ట్రైక్‌రేట్‌తో 117 (నాటౌట్) పరుగులు చేశాడు. వాస్తవానికి తొలి 10 బంతుల్లో వాట్సన్ ఒక్క పరుగు కూడా చేయలేదు. ఆ తర్వాత మ్యాచ్ 3.6 ఓవర్లలో డుప్లెసిస్ (10) వికెట్‌ను, మ్యాచ్ 13.3 ఓవర్‌లో సురేష్ రైనా (32) వికెట్లను కోల్పోయింది. 
 
నిజానికి వాట్సన్‌తో కలిసి రైనా ఇన్నింగ్స్‌ను చక్కదిద్డాడు. వీరిద్దరూ మంచి భాగస్వామ్యం నెలకొల్పడంతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సులువైంది. రైనా ఔట్ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన అంబటి రాయుడు కూడా బ్యాట్‌ను ఝుళిపించాడు. 19 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్స్ సాయంతో 17 పరుగులు చేశాడు. దీంతో 18.3 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మినహా మిగిలిన బౌలర్లంతా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు షేన్ వాట్సన్‌ అందుకున్నాడు.
 
ఐపీఎల్ 2018 విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు రూ.20 కోట్ల ప్రైజ్‌మనీ వరించింది. అలాగే, రన్నరప్‌కు రూ.12.5 కోట్లు లభించాయి. ఇక, ఈ ప్రైజ్‌మనీ, ఇతర విషయాలు పక్కనపెడితే ఫైనల్లో ఎవరు గెలిచినా సంతోషించింది మాత్రం తమిళులే. ఎందుకంటే.. హైదరాబాద్ సన్ రైజర్స్ యజమాని అయిన సన్ టీవీ అధినేత కళానిధి మారన్ కాగా, చెన్నై సూపర్ కింగ్స్ అధినేత కూడా ఇండియా సిమెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన శ్రీనివాసన్. వీరిద్దరూ తమిళులే కావడం గమనార్హం. శ్రీనివాసన్ గతంలో ఐసీసీ చైర్మన్‌గా, బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేశారు.