శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2019
Written By
Last Updated : శనివారం, 27 ఏప్రియల్ 2019 (12:11 IST)

ఐపీఎల్ 12వ సీజన్లో అర్థశతకాలు సాధించిన వీరులు వీరే...?

కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్ ప్లే ఆఫ్ దశకు చేరుకుంటోంది. గెలుపు బాటలో కొన్ని జట్లు.. పరాజయాలతో మరికొన్ని జట్లు ముందుకు వెళ్తున్నాయి. ఇందులో అత్యంత వేగంగా అర్థశతకాలు సాధించిన వీరుల సంగతికి వస్తే.. వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌పై దిల్లీ క్యాపిటల్స్‌కు గంపెడాశలు ఉన్నాయి.


కోచ్‌ రికీ పాంటింగ్‌, సలహాదారు గంగూలీకి అతడిపై అపారమైన గురి. అందుకు తగ్గట్టే ముంబయి ఇండియన్స్‌తో తొలి మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 18 బంతుల్లో అర్ధశతకం సాధించేశాడు. మొత్తం 78 పరుగులు చేశాడు.
 
అలాగే వెస్టిండీస్‌ వీరుడు ఆండ్రీ రసెల్‌ ఈ సీజన్‌లో విశ్వరూపం చూపిస్తున్నాడు. రసెల్‌ ఈ ఐపీఎల్‌లో రెండుసార్లు తక్కువ బంతుల్లో అర్ధశతకాలు చేశాడు. ఏప్రిల్‌ 19న బెంగళూరుపై 214 పరుగుల లక్ష్య ఛేదనలో 21 బంతుల్లోనే 50 చేశాడు. ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్‌తో సూపర్‌ ఓవర్‌ ఆడిన మ్యాచ్‌‌లో  తొలి ఇన్నింగ్స్‌లో 23 బంతుల్లో రసెల్‌ (62) అర్ధశతకం చేశాడు. దీంతో సూపర్‌ ఓవర్‌లో ఢిల్లీ గెలిచింది.
 
ఈ సీజన్‌లో అత్యంత ఉత్కంఠ రేపిన మ్యాచుల్లో ముంబయి వర్సెస్ పంజాబ్‌ ఒకటి. కేఎల్‌ రాహుల్‌ అజేయ శతకంతో పంజాబ్‌ మొదట 197 పరుగులు చేసింది. ఛేదనలో ముంబయి 63 పరుగులకే మూడు కీలక వికెట్లు చేజార్చుకోవడంతో విండీస్‌ పొడగరి పొలార్డ్‌ క్రీజులోకి వచ్చాడు. వాంఖడేలో 22 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. ఈ మ్యాచ్‌లో అతడు 3 సిక్సర్లు, 10 బౌండరీలతో 83 పరుగులు చేశాడు. జట్టును గెలిపించాడు.
 
ఆరు వరుస ఓటములతో అల్లాడిని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు మొయిన్‌ అలీ అండగా నిలిచాడు. బంతి, బ్యాటుతో రాణించాడు. కోహ్లీసేన సాధించిన విజయాల్లో కీలకమయ్యాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఏప్రిల్‌ 19న జరిగిన మ్యాచులో అలీ (66) బ్యాటింగ్‌ విధ్వంసకరంగా సాగింది. కేవలం 24 బంతుల్లో 50 పరుగుల మైలురాయి అందుకున్న సంగతి తెలిసిందే.