ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 1 నవంబరు 2020 (22:06 IST)

సురేష్ రైనా స్థానంలో రుతురాజ్.. మూడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లతో అదుర్స్

Ruturaj Gaikwad
ఐపీఎల్ 2020 టోర్నీ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా తప్పుకోవడంతో అతడి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? అనే దానిపై చర్చ సాగింది. ఇలాంటి సమయంలో రుతురాజ్ గైక్వాడ్ పేరు బయటకు వచ్చింది.

సురేష్ రైనా వెళ్తే ఏంటి.. మాకు రుతురాజ్ ఉన్నాడు.. అని చెన్నై యాజమాన్యం ప్రకటించింది. సురేష్ రైనా స్థానాన్ని భర్తీ చేసే సత్తా రుతురాజ్‌కు ఉందా అని చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు. అనుకున్నట్లుగానే మొదట్లో పెద్దగా రాణించలేదు రుతురాజ్ గైక్వాడ్. చెత్త ఆటతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు.  
 
మొదటి మ్యాచ్‌లో 0, ఆ తర్వాతి మ్యాచ్‌లో 5 పరుగులే చేశాడు. ఆ తర్వాతి అతడిని జట్టులోకి తీసుకోలేదు. కుర్రాళ్లలో స్పార్క్ కనిపించడం లేదని అందుకే చెన్నై ప్రదర్శన బాగాలేదని ధోనీ వ్యాఖ్యానించడంతో పెద్ద ఎత్తున దుమారం రేగింది. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో మరోసారి డకౌట్ అయ్యాడు రుతురాజ్. దాంతో అతడిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. ధోనీ చెప్పింది నిజమే.. కనీసం ఆడాలన్న ఓపిక కూడా రుతురాజ్‌కు లేదని విమర్శలు గుప్పించారు.
 
ఐతే ఆ తర్వాత మ్యాచ్ నుంచి తన సత్తా ఏంటో చూపించాడు రుతురాజ్. తనని విమర్శించిన వారే ప్రశంసించేలా అద్భుతంగా రాణించాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో అర్ధ సెంచరీలు చేసి.. మూడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు గెలిచాడు. మొదటి మూడు మ్యాచ్‌ల్లో 0, 5, 0 పరుగులు చేసిన రుతురాజ్... ఆ తర్వాతి మూడు మ్యాచ్‌ల్లో 65*, 72, 62* పరుగులు చేసి శభాష్ అనిపించాడు. దాంతో రుతురాజ్‌కు మద్దతుగా సోషల్ మీడియాలో అభిమానులు ట్వీట్ల మోత మోగిస్తున్నారు. వచ్చే ఏడాది ఐపీఎల్‌ కోసం చెన్నై జట్టుకు అద్భుతమైన ప్లేయర్ దొరికాడని ప్రశంసలు కురిపిస్తున్నారు.