బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం

భారత సైన్యం దాడిలో 35 మంది ఉగ్రవాదుల హతం

ఉగ్రవాదంపై భారత సైన్యం మరో విజయం నమోదు చేసుకుంది. భారత దేశంలోకి ప్రవేశించేందుకు పొంచి ఉన్న ఉగ్రవాదులను భీకర దాడులతో మట్టుబెట్టింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్థాన్‌కు గట్టి బుద్ధి చెప్పింది.
 
రక్షణ శాఖ వర్గాలు ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం భారత సైన్యం ఆర్టిలరీ గన్స్‌తో నిర్వహించిన దాడుల్లో దాదాపు 35 మంది జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు అంతమయ్యారు. జమ్మూ-కశ్మీరులోని నియంత్రణ రేఖ వెంబడి తంగ్‌ధర్ సెక్టర్ ఎదురుగా ఉన్న పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులోని ఉగ్రవాద స్థావరాలపై ఈ దాడులు జరిగాయి.

పాకిస్థాన్ దళాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి, ఎటువంటి హెచ్చరికలు లేకుండా సాధారణ ప్రజలపైనా, సైనిక స్థావరాలపైనా కాల్పులు జరపడంతో, భారత సైన్యం ప్రతీకార దాడులు నిర్వహించింది. పాకిస్థాన్ దళాలు శని, ఆదివారం మధ్య రాత్రి జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారత సైనికులు, ఓ పౌరుడు మరణించగా, ఇద్దరు సైనికులు, ఓ పౌరుడు గాయపడ్డారు.
 
దీంతో భారత సైన్యం ప్రతిస్పందించిందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఏడు ఉగ్రవాదుల స్థావరాలపై ఆర్టిలరీ దాడులు చేసిందని, 35 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిందని పేర్కొన్నాయి. ఇరు సైన్యాల మధ్య భారీ కాల్పులు కొనసాగుతున్నట్లు తెలిపాయి.

ఈ దాడుల్లో పాకిస్థాన్ సైనిక స్థావరాలు కూడా దెబ్బతిన్నట్లు, శత్రువులు గాయపడినట్లు తెలిపాయి. భారత భూభాగంలోకి ఉగ్రవాదులను అక్రమంగా పంపించేందుకు పాకిస్థాన్ సైన్యం ప్రయత్నించడంతో ఈ చర్య తీసుకున్నట్లు తెలిపాయి.