శనివారం, 5 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 6 మే 2021 (20:29 IST)

మద్యానికి కటకట.. ప్రాణం తీసిన హోమియోపతి మందులు.. ఎలా?

చత్తీస్‍‌గఢ్ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. కొందరు గ్రామస్థులు మద్యం లభించకపోవడంతో ఆల్కహాల్ కలిపిన హోమియోపతి మందులను వేసుకున్నారు. దీంతో వారు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం ఏడుగురు మృత్యువాతపడ్డారు. ఈ విషాదకర ఘటన చత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో జరిగింది. ఇదే ఘటనలో మరో ఐదుగురు మృత్యువుతో పోరాడుతున్నారు. 
 
ఈ వివాలను పరిశీలిస్తే, జిల్లాలోని సిరిగిట్టి పోలీస్ స్టేషన్ పరిధి కోర్మి గ్రామంలో ఏడుగురిలో నలుగురు మంగళవారం రాత్రి తమ ఇంట్లోనే మృతి చెందగా, మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించినట్టు బిలాస్‌పూర్ ఎస్పీ ప్రశాంత్ అగర్వాల్ తెలిపారు.   
 
కమలేశ్ ధురి (32), అక్షయ్ ధురి (21), రాజేశ్ ధురి (21), సమ్రు ధురి (25) కలిసి మంగళవారం రాత్రి 91 శాతం ఆల్కహాల్ ఉండే డ్రోసెరా-30 అనే హోమియోపతి సిరప్‌ను తీసుకున్నారు. ఆ తర్వాత వారు అస్వస్థతకు గురై మృత్యువాత పడ్డారు. 
 
వీరు కరోనాతో చనిపోయారని భావించిన కుటుంబ సభ్యులు అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఆ తర్వాతి రోజు ఉదయం అంత్యక్రియులు నిర్వహించారు. 
 
ఇదే సిరప్‌ను తీసుకుని అస్వస్థతకు గురైన ఖేమ్‌చంద్ ధురి (40), కైలాశ్ ధురి (50), దీపక్ ధురి (30)లను బిలాస్‌పూర్‌లోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వారు ముగ్గురూ మరణించారు. 
 
సమాచారం అందుకున్న వెంటనే గ్రామానికి చేరుకున్న పోలీసులు అదే సిరప్‌ను తాగి విషమ పరిస్థితిలో ఉన్న మరో ఐదుగురిని ఆసుపత్రులకు తరలించారు. వారి పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉందని అధికారులు తెలిపారు.