గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 4 ఏప్రియల్ 2018 (12:34 IST)

ఓ వైపు నిరాహార దీక్ష... మరోవైపు బిర్యానీ, మద్యం.... ఏరులై పారింది.. ఎక్కడ? (వీడియో)

కావేరీ జల మండలి ఏర్పాటు కోసం తమిళనాడులోని అధికార అన్నాడీఎంకే నేతలు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజు నిరాహారదీక్ష చేపట్టారు. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువులోగా కేంద్రం కావేరీ మేనేజ్‌మెంటు బోర్డు (సీఎంబీ

కావేరీ జల మండలి ఏర్పాటు కోసం తమిళనాడులోని అధికార అన్నాడీఎంకే నేతలు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజు నిరాహారదీక్ష చేపట్టారు. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువులోగా కేంద్రం కావేరీ మేనేజ్‌మెంటు బోర్డు (సీఎంబీ) ఏర్పాటు చేయనందుకు నిరసనగా... మంగళవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్నాడీఎంకే రాష్ట్రవ్యాప్త నిరాహార దీక్షకు పిలుపునిచ్చింది. 
 
రాజధాని చెన్నైలో జరిగిన నిరాహారదీక్షలో ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వంలు పాల్గొన్నారు. అలాగే, ఆయా జిల్లా కేంద్రాల్లో జరిగిన దీక్షా శిబిరాల్లో రాష్ట్ర మంత్రులు, ఆయా జిల్లాలకు చెందిన సీనియర్ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 
 
అయితే, ఈ నిరాహారదీక్ష ముగిసిన తర్వాత విస్తుబోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీక్షా శిబిరం వేదికలపై రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, నాయకులు నిరాహార దీక్షలో కూర్చోగా.. మరోవైపు కార్యకర్తలకు బిర్యానీ, మద్యం పంపిణీ చేశారు. వేలూరు, కోయంబత్తూరు, సేలం, పుదుకోట తదితర జిల్లాలో ఈ దృశ్యాలు కనిపించాయి. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
 
అలాగే, తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దృశ్యాలు చూస్తే అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు కావేరీ జల మండలి కోసం ఎంత నిజాయితీగా పోరాడుతున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చని విపక్ష పార్టీల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకొందరు ఈ దృశ్యాలను ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.