శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 12 జనవరి 2018 (11:20 IST)

ప్రధాని మోడీతో చంద్రబాబు భేటీ.. సమస్యల ఏకరవు...

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం సమావేశమయ్యారు. ప్రధాని నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా విభజన హామీలను నెరవేర్చాలంటూ ప్రధానిని ఆయన గట్టిగా కోరారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం సమావేశమయ్యారు. ప్రధాని నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా విభజన హామీలను నెరవేర్చాలంటూ ప్రధానిని ఆయన గట్టిగా కోరారు. అలాగే, నవ్యాంధ్ర ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలను ఆయన ఏకరవు పెట్టారు. 
 
ఈ సందర్భంగా ప్రధానంగా రెవెన్యూ లోటుపైనే చంద్రబాబు ఎక్కువ సేపు చర్చించినట్టు సమాచారం. తొలి ఏడాది రెవెన్యూ లోటు రూ.16,078.76 కోట్లు ఉందని... కేంద్ర ప్రభుత్వం రూ.7,500 కోట్లు ఇస్తామంటూ భరోసా ఇచ్చింది. కానీ, కేవలం రూ.3,979 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందని వాపోయినట్టు సమాచారం. మిగిలిన మొత్తాన్ని వెంటనే ఇవ్వాలని కోరారు. 
 
అలాగే, దేశీ ప్రాజెక్టుల ప్రతిపాదనల మొత్తం రూ.18,857 కోట్లు అని... వీటిలో రూ.8,349 కోట్ల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారని, మిగిలిన ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలపాలని విన్నవించారు. రాష్ట్రంలో నియోజకవర్గాల సంఖ్యను పెంచాలని కోరారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి రూ. 58,319.60 కోట్లు ఖర్చవుతుందనేది అంచనా అని... పునరావాసం కోసమే రూ. 33,858 కోట్లు అవరసరమని, దీన్ని కేంద్రమే భరించాలని విన్నవించారు. 
 
నాబార్డు, హడ్కో నుంచి రుణాలను తీసుకునే వెసులుబాటు కల్పించి, ఎఫ్ఆర్బీఎం నుంచి తప్పించాలని కోరారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. 11 జాతీయ విద్యా సంస్థల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. దుగరాజపట్నం పోర్టును నిలిపివేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. చెన్నై - విశాఖ కారిడార్ గురించి కూడా ప్రస్తావించారు. ఢిల్లీలో ఏపీ భవన్ విభజన ప్రక్రియను ఓ కొలిక్కి తీసుకుని రావాలని విజ్ఞప్తి చేశారు. ఇలా అనేక సమస్యలను ప్రధానమంత్రికి ఆయన పూసగుచ్చినట్టు వివరించారు.