రూ.కోట్లు దండుకున్న బీజేపీ : విరాళాల సేకరణలో టాప్  
                                       
                  
				  				   
				   
                  				  కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ విరాళాల్లో టాప్ లేపింది. వరుసగా ఏడోసారి కోట్లాది రూపాయల విరాళాలను దండుకుంది. ఫలితంగా ఇతర పార్టీల కంటే అగ్రస్థానంలో నిలిచింది. 
				  											
																													
									  
	 
	2019-20లో ఆయా పార్టీలకు విరాళాల ద్వారా సమకూరిన మొత్తానికి సంబంధించిన వివరాలను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తన వెబ్సైట్ ద్వారా వెల్లడించింది. ఈ జాబితాలో బీజేపీ రూ.785.77 కోట్లతో అగ్రస్థానంలో నిలిచింది. 
				  
	 
	పదేళ్ళపాటు అధికారంలో ఉండి ఆతర్వాత అధికారం కోల్పోయిన కాంగ్రెస్కు రూ.139 కోట్లు, ఎన్సీపీకి రూ.59 కోట్లు, సీపీఎంకు రూ.19.6 కోట్లు, టీఎంసీకి రూ.8 కోట్లు, సీపీఐకి రూ.1.9 కోట్లు విరాళాల ద్వారా సమకూరాయి.
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	 
	తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, గులాబీ పార్టీ టీఆర్ఎస్కు రూ.89,55,21,348 విరాళంగా రాగా, వైసీపీకి రూ.8,92,45,126, టీడీపీకి రూ.2,60,64,011, ఎంఐఎంకు రూ.13,85,000 విరాళాల రూపంలో సమకూరాయి. 
				  																		
											
									  
	 
	తెరాసకు 41 మంది రూ.20 వేలకు పైగా విరాళంగా అందించారు. మంత్రి కేటీఆర్, కూర్మయ్యగారి నవీన్ అత్యధికంగా రూ.2.50 లక్షల చొప్పున విరాళం ఇచ్చారు. తమిళనాడుకు చెందిన జేఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ లిమిటెడ్ వైసీపీకి అత్యధికంగా రూ.2.50 కోట్లను విరాళంగా ఇచ్చింది. 
				  																	
									  
	 
	అలాగే, నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన పి.శివకుమార్ రెడ్డి కోటి రూపాయలు ఇచ్చారు. చెన్నైకి చెందిన ట్రింప్ ఎలక్ట్రోరల్ ట్రస్ట్ టీడీపీకి అత్యధికంగా కోటి రూపాయలు విరాళం ఇచ్చింది. అలాగే, వివిధ సంస్థల నుంచి ఆయా పార్టీలకు లక్షల రూపాయలు విరాళాల రూపంలో సమకూరాయి.