శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 నవంబరు 2020 (09:46 IST)

''నివార్'' వచ్చేస్తోంది.. తమిళనాడు, పుదుచ్చేరికి సైక్లోన్ అలెర్ట్.. చెన్నైకి మళ్లీ...?

తమిళనాడు మరో తుఫాను ప్రమాదం ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుంది. ఈ అల్పపీడనం రెండు రోజుల్లో తుఫానుగా మారబోతోంది. దీనివల్ల తమిళనాడుకు నవంబర్ 25 నుంచి అతి భారీ వర్ష సూచన ఉంది. ఈ తుఫానుకు ''నివార్'' అని పేరు పెట్టారు. ఇది ప్రస్తుతం ఉత్తర తమిళనాడు తీరం వైపు కదులుతోంది. 
 
తుఫానును దృష్టిలో పెట్టుకొని... తమిళనాడు, పుదుచ్చేరికి సైక్లోన్ అలర్ట్ జారీ చేశారు. నవంబర్ 22 నుంచి జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా నవంబర్ 22 నుంచి 25 వరకూ తుఫాను వల్ల సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి... ఎట్టి పరిస్థితుల్లో బంగాళాఖాతంలోకి వెళ్లొద్దని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో జాలర్లు కూడా చేపల వేటకు వెళ్లొద్దని చెప్పారు.
 
అల్పపీడనం 24 గంటల్లో వాయుగుండంగా మారుతుందనీ... ఆ తర్వాత మరో 24 గంటల్లో తుఫానుగా అవుతుందని వాతావరణ అధికారులు తెలిపారు. ఇది తమిళనాడులోని కారైకల్, మహాబలిపురం దగ్గర నవంబర్ 25న మధ్యాహ్నం వేళ తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు. నవంబర్ 25 నుంచి తమిళనాడులోని చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. ఇంకా చెన్నై నగర ప్రజలు ఈ సైక్లోన్ కారణంగా అప్రమత్తంగా వుండాలని అధికారులు చెప్తున్నారు.