గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 నవంబరు 2020 (15:30 IST)

ఢిల్లీని వీడితేనే ప్రాణాలతో ఉండగలరు... సోనియాకు వైద్యుల సలహా?!

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి వైద్యులు గట్టి హెచ్చరిక చేశారు. తక్షణం ఢిల్లీని వీడాలని ఆమెకు సూచించారు. లేనిపక్షంలో తీవ్ర అనారోగ్యానికి గురవుతారని హెచ్చరించినట్టు సమాచారం. ప్రస్తుతం ఢిల్లీలో వాయు కాలుష్యం తారా స్థాయికి చేరుకుంది. నానాటికీ గాలిలో నాణ్యత నానాటికీ క్షీణించిపోతోంది. ఈ కాలుష్యం వల్ల ఆమెకు ఛాతి ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదముందని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. అందుకే తక్షణం ఢిల్లీని వీడాలని వైద్యులు సలహా ఇచ్చినట్టు కాంగ్రెస్ వర్గాల సమాచారం. 
 
నిజానికి సోనియా గాంధీ కొంత కాలంగా ఛాతి ఇన్‌ఫెక్షన్‌తో బాధడుతున్నారు. అలాగే, ఆమె కేన్సర్‌కు కూడా మందులు వాడుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలో గత జూలై నెల 30వ తేదీన గంగారాం ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత సెప్టెంబరు మాసంలో సాధారణ వైద్య పరీక్షల నిమిత్తమై కొన్ని రోజుల పాటు ఆమె విదేశాలకు వెళ్లారు. అప్పటి నుంచి ఆమె వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో ఢిల్లీలోని కాలుష్యం కారణంగా ఉబ్బసం వచ్చే అవకాశం ఉందని, అంతేకాకుండా ఛాతి నొప్పి కూడా తీవ్రతరం అయ్యే అవకాశాలున్నాయని, అందుకే ఇతర ప్రాంతానికి మకాం మార్చాలని సోనియాకు వైద్యులు సూచించారు. ఈ సూచనలతో సోనియా గోవా లేదా చెన్నైకి వెళ్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. సోనియాతో పాటు రాహుల్ లేదా ప్రియాంక కూడా వెళ్లనున్నట్లు సమాచారం.