1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 23 ఏప్రియల్ 2024 (13:20 IST)

బెంగుళూరు విమానాశ్రయంలో పది అనకొండలతో పట్టుబడిన ప్రయాణికుడు!!

anacondas
బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడు ఏకంగా పది అనకొండలతో పట్టుబడ్డాడు. ఈ షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అనకొండలను స్మగ్లింగ్ చేయబోతూ ఓ ప్రయాణికుడు కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డాడు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ విమాన ప్రయాణికుల బ్యాగేజీని తనిఖీ చేయగా, అందులో ఏకంగా 10 పసుపు అనకొండలు వెలుగు చూశాయి. ఓ సూట్ కేసును తెరవగా అందులో తెల్ల కవర్లలో చుట్టిన అనకొండలు కనిపించాయి. దీంతో నిందితుడిని అరెస్టు చేశామని ఎయిర్ పోర్టు పోలీసులు తెలిపారు. 
 
ఈ ఘటనపై స్వాధీనం చేసుకున్న అనకొండలు ఫోటోలను అధికారులు సోషల్ మీడియాలో షేర్ చేశఆరు. వన్యప్రాణుల స్మగ్లింగ్‌ను ఎంతమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. భారతీయ చట్టాల ప్రకారం వన్యప్రాణులతో వ్యాపారం చేయడం చట్ట విరుద్ధమన్నారు. వన్య ప్రాణాలు స్మగ్లింగ్‌ను నిరోధించడానికి కస్టమ్స్ యాక్ట్ 1962సో ఎన్నో సెక్షన్లు ఉన్నాయి. ఈ ఉదంతం సోషల్ మీడియాను షేక్ చేసింది. బ్యాంకాక్ ప్రయాణికుడి చర్యను చాలా మంది నెటిజన్లు తప్పుబడుతున్నారు. 
 
ఎనిమిదేళ్ళ వేతనాన్ని నెల రోజుల్లో తిరిగి చెల్లించాలా? మమతా బెనర్జీ ఫైర్ 
 
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో 25 వేల మంది ఉపాధ్యాయుల నియామకం చెల్లదంటూ కోల్‌కతా హైకోర్టు సోమవారం సంచలనం తీర్పును వెలువరించడమే కాకుండా, వారు గత ఎనిమిదేళ్లుగా తీసుకున్న వేతనం కేవలం నాలుగు వారాల్లో అంటే నెల రోజుల్లో తెరిగి చెల్లించాలంటూ జారీచేసిన ఉత్తర్వులపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. టీచర్లు ఎవరూ అధైర్యపడొద్దని, ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని పిలుపునిచ్చారు. పైగా, కోల్‌కతా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టును సవాల్ చేయనున్నట్టు ప్రకటించారు. ఎనిమిదేళ్ల వేతనాన్ని కేవలం నాలుగు వారాల్లో చెల్లించడం ఎలా సాధ్యం? అని ఆమె ప్రశ్నించారు. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, గత 2016లో నియమితులైన 24 వేల ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేస్తూ తీర్పును వెలువరించింది. ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్ల నియామకాల కోసం అనుసరించిన ఎంపిక ప్రక్రియ చట్ట విరుద్ధంగా ఉందని ప్రకటిస్తూ ఆ ఉద్యోగాలు పొందిన వారి అపాయింట్లెను రద్దు చేసింది. ఆ టీచర్లంతా ఆరు వారాల్లోగా వారు పొందిన జీతాలను 12 శాతం వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశించింది. 
 
అదేసమయంలో కేన్సర్‌తో బాధపడుతున్న సోమా దాస్ అనే వ్యక్తికి ఇచ్చిన వ్యక్తికి మాత్రం మినహాయింపునిచ్చిఉద్యోగంలో కొనసాగేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే, కొత్త టీచర్ల నియామక ప్రక్రియను 15 రోజుల్లో చేపట్టాలని బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్‌ను ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ దెబాంగ్యు బాసక్, మొహమ్మద్ షబ్బర్ రషీదీలతో కూడిన హైకోర్టు ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది. కోర్టు తీర్పుతో గ్రూపు-సి, డీతో పాటు 9, 10, 11, 12 తరగతుల టీచర్లకు చెందిన సుమారు 24 వేల ఉద్యోగాలు రద్దు అయ్యాయి. 
 
హైకోర్టు ఇలా సంచలన తీర్పును వెలువరించడానికి అసలేం జరిగిందన్న విషయాన్ని పరిశీలిస్తే, పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ ఖాళీగా ఉన్న 24,640 టీచర్ పోస్టుల భర్తీకి 2016లో రాష్ట్ర  స్థాయి ఎంపిక పరీక్ష నిర్వహించింది. అయితే అభ్యర్థుల ఎంపికలో అక్రమాలు జరిగాయని.. అనర్హులు లంచాలిచ్చి ఉద్యోగాలు పొందారని ఆరోపిస్తూ నిరుద్యోగులు ఆందోళన చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ఆదేశంతో హైకోర్టు విచారణ ప్రారంభించింది. కుంభకోణం ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని సీబీఐని ఆదేశించింది.
 
దీంతో రంగంలోకి దిగిన సీబీఐ ఈ స్కాంలో పాత్ర ఉందంటూ 2022లో నాటి విద్యాశాఖ మంత్రి పార్థా చటర్జీతోపాటు బెంగాల్ స్కూల్ సర్వీసు కమిషన్‌లో పనిచేసిన కొందరు అధికారులను అరెస్టు చేసింది. పార్థా చటర్జీకి ప్రధాన అనుచరురాలైన అర్పితా ముఖర్జీకి చెందిన కోల్‌కతా నివాసాన్ని సీబీఐ తనిఖీ చేయగా రూ.21 కోట్ల నగదు, రూ.కోటికిపైగా విలువ చేసే నగలు లభించాయి. ఈ కేసులో సీబీఐ తమ దర్యాప్తు కొనసాగించి 3 నెలల్లోగా నివేదిక సమర్పించాలని హైకోర్టు తాజాగా ఆదేశించింది. సీబీఐ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకుని హైకోర్టు ఇపుడు సంచలన తీర్పును వెలువరించింది. 
 
ఈ తీర్పుపై మమతా బెనర్జీ స్పందించారు. ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తిగా రద్దు చేయడం చట్ట విరుద్ధమన్నారు. ఉద్యోగాలు కోల్పోయిన వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని పేర్కొన్నారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని తెలిపారు. ఉద్యోగాలు కోల్పోయిన వారు అధైర్యపడొద్దని చెప్పారు. కొందరు బీజేపీ వారు నాయమూర్తులను, న్యాయవాదులను ప్రభావితం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.