శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 3 మే 2019 (14:18 IST)

ఒరిస్సాను వణికిస్తున్న ఫణి... కాగితం ముక్కలా ఎగిరిపోయిన రూఫ్‌టాప్

ఒరిస్సా రాష్ట్రాన్ని ఫణి తుఫాను వణికిస్తోంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుఫాను గత వారం రోజులుగా కోస్తా రాష్ట్రాలను భయపెడుతూ వచ్చింది. అయితే, ఈ తుఫాను శుక్రవారం ఉదయం ఒరిస్సా రాష్ట్రంలోని పూరీ వద్ద తీరాన్ని తాకింది. ఈ తుఫాను తీరందాటే సమయంలో గంటకు 200 కిమీ వేగంతో గాలులు వీచాయి. ఆ తర్వాత శుక్రవారం మధ్యాహ్నానికి పూర్తిగా బలహీనపడి... ఆ తర్వాత బంగ్లాదేశ్ వైపు పయనించవచ్చని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 
 
అయితే, తీరందాటిన తర్వాత ఫణి తుఫాను ఒరిస్సాను వణికిస్తోంది. తాజాగా రాజధాని భువనేశ్వర్‌లో ఫణి విధ్వంసంపై వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. స్థానిక భువనేశ్వర్ ఎయిమ్స్ ఆసుపత్రిపై ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ రూఫ్‌టాప్ ఫణి గాలులకు కాగితం ముక్కలా ఎగిరిపోయింది. అలాగే ఆసుపత్రి ప్రాంగణంలో భారీ చెట్లు కూడా చిగురుటాకుల్లా వణికిపోయాయి.
 
ఫణి పెను తుఫాను బీభత్సానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా, ఫణిని ఎదుర్కొనేందుకు నిత్యావసరాలను సమకూర్చుకున్నామనీ, అవసరమైతే ఇతరులకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని భువనేశ్వర్ ఎయిమ్స్ అధికారులు తెలిపారు. మరోవైపు, ఉత్తరాంధ్రపై కూడా ఫణి తీవ్రమైన ప్రభావం చూపుతోంది. దీంతో ఈసీ విశాఖ, విజయనగరం, తూర్పు గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో కోడ్‌ను ఎత్తివేసింది. ఇక్కడ సహాయ చర్యలపై సమీక్ష చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది.