శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 27 నవంబరు 2018 (13:25 IST)

అకతాయిల వేధింపులు.. బస్సులో నుంచి కిందికి దూకేసిన ఢిల్లీ విద్యార్థిని

ప్రతి రోజూ కాలేజీకి వెళ్లి వచ్చే ఓ యువతి బస్సులో నుంచి కిందికి దూకేసింది. బస్సులో అకతాయిల వేధింపులు తాళలేక ఈ పనికి పాల్పడింది. ఈ విషయాన్ని ఆమె సోదరి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఢిల్లీ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేసే ఓ యువతి ప్రతి రోజూ రూట్ నంబర్ 544లో ప్రయాణిస్తోంది. ఈ బస్సులో ప్రయాణించే అకతాయిల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. గతంలో ఓ మారు వేధిస్తున్న విషయాన్ని ఇతర ప్రయాణికులకు చెప్పడంతో, ఆ ఆకతాయిని కిందకు దించేశారు. అయినా అతను వదల్లేదు. అదే మార్గంలో కనిపిస్తూ, ఆమెపై వేధింపులను మరింతగా పెంచారు. ఈ క్రమంలో తాజాగా అతనితో పాటు.. మరికొందరు అకతాయిలు ఆమెను వేధించారు. ఈ వేధింపులను తట్టుకోలేని ఆ యువతి బస్సులో నుంచి కిందికి దూకేసింది. 
 
ఈ విషయాన్ని ఆమె సోదరి సోషల్ మీడియాలో వెల్లడించింది. "నా సోదరి కొన్ని రోజులు వేరే మార్గాల్లో కాలేజీకి వెళ్లింది. రూట్ మారడం వల్ల కాలేజీకి అలస్యంగా చేరుకునేది. దీంతో తిరిగి 544 రూట్‌లోనే ప్రయాణం సాగిస్తోంది. చాలా మంది అమ్మాయిలు ఈ మార్గంలో వెళుతుంటారు. దీన్ని అదనుగా చేసుకునే ఆకతాయిలు వేధింపులతో రెచ్చిపోతున్నారు. శనివారం నా సోదరి బస్సు నుంచి దూకేసి గాయాల పాలైంది. నీ గురించి మాకు మొత్తం తెలుసు. నువ్వు చదువుతున్నది ఎక్కడో కూడా తెలుసు అంటుంటే భయపడింది" అని ఆమె తెలిపింది. దీనిపై స్పందించిన ఆ ప్రాంత డీసీపీ విజయ్‌ కుమార్‌, ఈ మార్గంలో పోలీసుల నిఘాను పెంచి అమ్మాయిలకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.