1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 30 జూన్ 2019 (14:38 IST)

కుప్పంలో రూ.11 లక్షలు... చంద్రగిరిలో రూ.15 లక్షలు

ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు పెట్టిన ఖర్చుల వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం స్థానం నుంచి పోటీ చేయగా, ఆయన ఎన్నికల కోసం మొత్తం పెట్టిన ఖర్చు కేవలం రూ.11 లక్షలు మాత్రమేనట. ఈ మేరకు ఆయన తరపున ఎన్నికల అధికారులకు లెక్కలు అందాయి. అదేసమయంలో ఆయన ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి రూ.15 లక్షలు వ్యయం చేశారు. అభ్యర్థుల ఖర్చు విషయంలో కుప్పం నియోజకవర్గం జిల్లాలో 11వ స్థానంలో నిలిచింది. 
 
అలాగే, చిత్తూరు జిల్లాలో అత్యధిక ఎన్నికల వ్యయం చోటుచేసుకున్న నియోజకవర్గంగా ప్రచారం జరిగిన స్థానం చంద్రగిరి. ఇక్కడ నుంచి వైకాపా అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేశారు. అలాగే, టీడీపీ అభ్యర్థి పులివర్తి నానీ పోటీ చేశారు. వీరిలో నాని రూ.15 లక్షలు, వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి రూ.12 లక్షలు ఖర్చు చేసినట్టు లెక్కలు చూపించారు. 
 
చిత్తూరు సెగ్మెంటులో టీడీపీ అభ్యర్థి ఏఎస్‌ మనోహర్‌ రూ.14 లక్షలు, వైసీపీ అభ్యర్థి జంగాలపల్లె శ్రీనివాసులు రూ.18 లక్షలు ఖర్చు చేయగా శ్రీకాళహస్తిలో టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్‌రెడ్డి రూ.16 లక్షలు, వైసీపీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్‌రెడ్డి రూ.17 లక్షలు వెచ్చించారు. కానీ, ఈ స్థానం నుంచి బరిలోకి దిగిన జనసేన అభ్యర్థి నగరం వినుత రూ.8 లక్షలకే పరిమితంకాగా బీజేపీ అభ్యర్థి కోలా ఆనంద్‌ మాత్రం రూ.13 లక్షలు ఖర్చు చేసినట్టు లెక్కలు చూపించారు. 
 
నగరిలో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్‌, వైసీపీ అభ్యర్థి ఆర్‌కే రోజా సమానంగా రూ.15 లక్షల వంతున వెచ్చించినట్టు రికార్డులు చూపారు. కాగా, అసెబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు గరిష్టంగా రూ.28 లక్షలు, పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థి 70 లక్షల చొప్పున ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉంది. అంతకుమించి ఎక్కువ ఖర్చు పెడితే అనర్హులవుతారు.