శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By మోహన్
Last Updated : మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (18:51 IST)

పుట్టిన పసికందుకు కరెన్సీ నోట్లతో అభిషేకం చేశారు..

సాధారణంగా ఇంట్లో తొలి సంతానం పుడితే తల్లిదండ్రులు తమ స్థాయికి తగ్గట్టు స్వీట్లు పంచుతారు, మరికొందరు భోజనాలు పెట్టిస్తారు. మరికొందరు ఊరంతా భోజనాలు పెట్టించి దాన ధర్మాలు చేస్తారు. అయితే ఓ జంట మాత్రం ఎవ్వరూ ఊహించని రీతిలో పాపపై నోట్ల వర్షం కురిపించింది. కరెన్సీ నోట్లతో పసికందుని కప్పేశారు. పాప చుట్టూ నోట్లు ఉంచారు. 
 
వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజమండీ.. గుజరాత్ రాష్ట్రంలోని మాల్వీ గ్రామంలో ఈ ఘటన జరిగింది. పాపని కరెన్సీ నోట్లతో కప్పి ఉంచిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రూ.2వేలు, రూ.200 నోట్లతో పాపని కప్పేశారు.
 
పెళ్లైన 20 ఏళ్ల తర్వాత ఆ జంటకి పాప పుట్టింది. దీంతో వారి ఆనందానికి హద్దులు లేవు. సంతానం కోసం వారు ఎన్నో గుళ్లు, గోపురాలు తిరిగారట. ఎంతోమంది వైద్యులను సంప్రదించారట. దేవుళ్లు, దేవతలకూ మొక్కారట. ఇప్పటికి ఫలితం దక్కిందని తెగ ఆనందపడిపోతున్నారు. పాపపై తమకున్న ప్రేమను ఇలా చాటుకున్నారు. 
 
సాక్ష్యాత్తూ ఆ లక్ష్మీ దేవి తమ ఇంట అడుగుపెట్టిందని ఆ జంట సంబరపడుతోంది. పసికందుపై అపార ప్రేమను చూపిస్తూ నోట్ల వర్షం కురిపించింది. పాప పుట్టిన ఆనందంలో గ్రామంలో భారీ పూజ చేశారు. ఊళ్లో అందరిని పిలిచి భోజనాలు పెట్టించారు.