శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 14 డిశెంబరు 2017 (08:54 IST)

మోడీకి బుద్ధిచెపుతామంటున్న పటీదార్లు.. నేడు రెండో దశ పోలింగ్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన సొంతరాష్ట్రం గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం రెండో దశ పోలింగ్ జరుగనుంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన సొంతరాష్ట్రం గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం రెండో దశ పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల 18న ఫలితాలు వెలువడనున్నాయి. తొలివిడతలో ఈనెల 9న రాష్ట్రంలోని 89 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 14 జిల్లాల్లోని 93 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండోవిడత ఎన్నికలు జరుగనున్నాయి. మలిదశలో 2 కోట్ల 22 లక్షల మంది ఓటర్లు ఇచ్చే తీర్పు కోసం 851 మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. 
 
ఆ రాష్ట్ర జనాభాలో 12 శాతంగా ఉన్న పాటిదార్లకు ప్రభావవంతమైన సామాజికవర్గంగా పేరుంది. ఈ ఎన్నికల్లో వారు ఎవరిపక్షాన నిలుస్తారోనన్నది ఆసక్తికరంగా మారింది. సంప్రదాయ పాటిదార్లు బీజేపీకే మద్దతిస్తుండగా, హార్దిక్ పటేల్ నాయకత్వంలో యువతరం మాత్రం మార్పును కోరుకుంటున్నది. హార్దిక్ ఇప్పటికే కాంగ్రెస్‌కు బాహాటంగానే మద్దతు ప్రకటించారు. ఈసారి ఎన్నికలబరిలో దూసుకెళ్తున్న హార్దిక్ పటేల్ - అల్పేశ్ ఠాకూర్ - జిగ్నేశ్ మేవాని త్రయం బీజేపీ కంటిలో నలుసులా తయారైంది. 
 
ఇకపోతే, బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రధాని మోడీ అంతా తానై నడిపించారు. బహిరంగసభల్లో పదే పదే తాను గుజరాతీనని, తనకు ఏదైనా అవమానం జరిగితే అది గుజరాత్‌కు జరిగినట్లేనంటూ భావోద్వేగంతో ఆయన ప్రసంగాలు సాగాయి. ప్రారంభంలో పదే పదే ప్రస్తావనకు వచ్చిన వికాస్ (అభివృద్ధి) అంశం ఎన్నికల ప్రచారం ఊపందుకున్నకొద్దీ వెనక్కి వెళ్లిపోయింది. దానిస్థానంలో మత, కుల రాజకీయాలు ముందుకొచ్చాయి. ఇక పాకిస్థాన్ చుట్టూ సాగిన ఆరోపణలు, ప్రత్యారోపణలు ప్రచార పర్వాన్నే కుదిపేశాయి. 
 
ఈ ఎన్నికల్లో ఎటు చూసినా కాంగ్రెస్ పార్టీకి గెలుపు తథ్యమని ప్రముఖ ఎన్నికల సర్వేక్షకుడు యోగేంద్ర యాదవ్‌ చెబుతున్నారు. కాంగ్రెస్‌ 43 శాతం, బీజేపీ 43 శాతం ఓట్లు సాధిస్తాయన్నారు. బీజేపీ 83 సీట్లకే పరిమతమవుతుందని, కాంగ్రెస్‌కు మాత్రం 95 స్థానాలొచ్చి అధికారంలోకి వస్తుందని అంచనా వేశారు. 2012 ఎన్నికల ఫలితాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతంలో 16 సీట్లు బీజేపీకి తగ్గుతాయని చెప్పారు. సెమీ అర్బన్‌ ప్రాంతంలోనూ 10 సీట్లు అధికార పార్టీకి నష్టం వాటిల్లుతుందన్నారు. పట్టణ ప్రాంతాల్లో బీజేపీ ఫర్వాలేదనిపించినా 6 సీట్లు తగ్గే అవకాశముందన్నారు.