గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 25 జులై 2018 (14:54 IST)

ఎమ్మెల్యే ధ్వంసం కేసులో హార్దిక్ పటేల్‌కు జైలుశిక్ష

గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యే రిషికేష్ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన కేసులో పటీదార్ ఉద్యమ యువ నేత హార్దిక్ పటేల్‌కు స్థానిక కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. హార్దిక్‌తోపాటు లాల్జ

గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యే రిషికేష్ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన కేసులో పటీదార్ ఉద్యమ యువ నేత హార్దిక్ పటేల్‌కు స్థానిక కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. హార్దిక్‌తోపాటు లాల్జీ పటేల్, ఏకే పటేల్‌కు కూడా ఇదే శిక్షపడింది. రూ.50 వేల జరిమానా కూడా కట్టాలని కోర్టు ఆదేశించింది.
 
గత 2015లో జరిగిన గుజరాత్ పటీదార్ ఉద్యమ సమయంలో అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో విస్ నగర్‌లోని బీజేపీ ఎమ్మెల్యే రుషికేష్ ఆఫీస్‌ను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఈ ఆందోళనలో మూడు వేల మంది పాల్గొన్నారు. 17 మందిపై కుట్ర, దాడి, అల్లర్ల కేసులు నమోదు అయ్యాయి. 
 
ఈ కేసులో అరెస్టు అయిన హార్దిక్ పటేల్.. ఆ తర్వాత బెయిల్‌పై విడుదల అయ్యారు. అనంతరం కొన్ని నెలలు మెహసానా జిల్లాలోకి ప్రవేశించకుండా కోర్టు కూడా ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో తాజాగా కోర్టు తీర్పును వెలువరించగా, ఇందులో హార్దిక్ పటేల్‌కు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 
 
కాగా, ఈ కోర్టు తీర్పుకి ముందే హార్దిక్ పటేల్ తన అనుచరులతో కీలక భేటీ నిర్వహించారు. కోర్టు తీర్పు ఎలా ఉన్నప్పటికీ ఎలాంటి ఆందోళనలకు దిగొద్దని సూచించారు. అలా వారు ఊహించినట్టుగానే కోర్టు తీర్పు వెలువడటంతో ఆయన మద్దతుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.