1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 25 అక్టోబరు 2018 (12:33 IST)

భర్త పరిస్థితి అది.. లోబరుచుకుని.. స్నేహితులతో వివాహితపై గ్యాంగ్ రేప్

మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే వున్నాయి. తాజాగా ఓ వివాహితపై సామూహిక అత్యాచారం జరిగింది. నిస్సహాయురాలైన ఓ వివాహితను బెదిరించి, బ్లాక్‌ మెయిల్‌ చేసి తాను అత్యాచారం చేయడమేకాక, మరో ఇద్దరు స్నేహితులను ఆమెపై ఉసిగొల్పిన కామాంధుడి తీరు వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్‌కు చెందిన ఓ వివాహిత (33) హైదరాబాద్‌లో భర్త, కొడుకుతో నివాసం ఉంటోంది. 
 
భర్త మానసిక స్థితి సరిగా లేకపోవడంతో.. ఉద్యోగం చేసుకుంటూ కాలాన్ని నెట్టేస్తోంది. ఏడాది క్రితం ఈమెకు జగిత్యాలకు చెందిన నగేష్‌తో పరిచయం అయింది. తరచూ వీరు ఫోన్‌లో మాట్లాడుకునే వారు. ఆమెతో మాట్లాడిన సంభాషణలను నగేష్ రికార్డ్ చేశాడు. కొన్నాళ్ల తరువాత సదరు వివాహితను లోబర్చుకునే ప్రయత్నాలు మొదలు పెట్టాడు. 
 
ఆమె తిరస్కరించడంతో ఫోన్‌ సంభాషణలు బయట పెడతానంటూ బ్లాక్‌ మెయిల్‌ చేయడం మొదలు పెట్టాడు. భయపడిన ఆమె మెత్తపడగానే జగిత్యాలకు రావాల్సిందిగా కోరాడు. అతను చెప్పినట్లే ఆమె ఆదివారం జగిత్యాల వెళ్లగా ఆమె బిడ్డను వేరొక వ్యక్తికి అప్పగించాడు. తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెను కారులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లాడు. 
 
అక్కడ ఆమెపై తన స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెను తెచ్చి జగిత్యాల బస్టాండ్‌లో బిడ్డతోపాటు వదిలేసి వెళ్లిపోయారు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.