బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 16 డిశెంబరు 2017 (13:24 IST)

కాంగ్రెస్ ఎవ్వరికీ తలవంచదు : సోనియా గాంధీ

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి బాధ్యతల నుంచి సోనియా గాంధీ తప్పుకున్నారు. ఈ బాధ్యతలను తన బిడ్డ రాహుల్ గాంధీకి అప్పగించారు. శనివారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పార్టీ పగ్గాలను రాహుల్ చేపట్టారు.

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి బాధ్యతల నుంచి సోనియా గాంధీ తప్పుకున్నారు. ఈ బాధ్యతలను తన బిడ్డ రాహుల్ గాంధీకి అప్పగించారు. శనివారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పార్టీ పగ్గాలను రాహుల్ చేపట్టారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 
 
కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఇదే తన చివరి ప్రసంగమన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినంత కాంగ్రెస్ మాత్రాన… ఎవరికీ తలవంచబోదని, ఎప్పటికీ వెనకడుగు వేయదన్నారు. చిన్నతనంలోనే హింస ప్రభావాన్ని ఎదుర్కొని నిలబడ్డ రాహుల్… రాజకీయాల్లోకి వచ్చాక ఎంతో నిర్దాక్షిణ్యమైన వ్యక్తిగత విమర్శలను ఎదుర్కొన్నాడన్నారు. అవి అతన్ని శక్తిమంతుడ్ని చేశాయన్నారు. 
 
ఇందిర వెళ్లిపోయిన కొన్నాళ్లకు రాజీవ్‌జీ కూడా తమను విడిచి వెళ్లిపోయారన్నారు. తన అండదండ సర్వం కోల్పోయిన భావన కలిగిందన్నారు. ఆ పరిస్థితులను తట్టుకొని నిలబడటానికి కొంత సమయం పట్టిందన్నారు. ఇందిర తనను కన్నకూతురిలా దగ్గరికి చేరదీశారన్నారు. భారతీయ, సంస్కృతీ సంప్రదాయాలు తెలిపి, నేర్పించారన్నారు. 1984లో ఇందిరాగాంధీ హత్యకు గురయ్యారని…. కన్న తల్లిని కోల్పోయిన భావన కలిగిందన్నారు. ఆ తర్వాత తన భర్తను కోల్పోయాననీ, అలాంటి క్లిష్టపరిస్థితుల్లో పార్టీ బాధ్యతలు చేపట్టినట్టు ఆమె గుర్తు చేశారు. 
 
ఇపుడు రాహుల్ గాంధీ సామర్థ్యంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, అతనిలో శాంతి, సహనశీలత ఎక్కువని అన్నారు. ఇరవై ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తనకు ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. రాజీవ్ గాంధీ పెళ్లితోనే తనకు రాజకీయాలు పరిచయమయ్యాయని, గాంధీ కుటుంబం అద్భుతమైనదన్నారు. ఈ కుటుంబం దేశం కోసం జైళ్లకు వెళ్లిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతున్న సందర్భంలో కార్యకర్తల వినతి మేరకు తాను బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చిందని సోనియా గాంధీ గుర్తుచేశారు.