1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 19 ఏప్రియల్ 2024 (09:24 IST)

లోక్‌సభ మహా సంగ్రామం : పొలింగ్ తొలి ఘట్టం ప్రారంభం

cm stalin couple
లోక్‌సభ ఎన్నికల మహా సంగ్రామంలో భాగంగా పోలింగ్ తొలి ఘట్టం శుక్రవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. లోక్‌సభ ఎన్నికలు 2024లో భాగంగా, తొలి దశ పోలింగ్ ప్రశాంత వాతావరణంలో మొదలైంది. భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. పకడ్బందీ ఏర్పాట్లు, పటిష్ఠ భద్రత మధ్య ఓటర్లు ఓటు వేస్తున్నారు. 
 
తొలి దశలో మొత్తం 1.87 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏకంగా 18 లక్షల మంది భద్రతా సిబ్బందిని ఎన్నికల సంఘం రంగంలోకి దించింది. శుక్రవారం జరుగుతున్న ఈ ఓటింగులో మొత్తం 16 కోట్ల మంది ఓటర్లు 1,625 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఏడు దశల లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా, తొలి దశలోనే అత్యధిక స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. 
 
అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలలో 92 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా నేడు పోలింగ్ కొనసాగుతోంది. తొలి దశలో 8 మంది కేంద్ర మంత్రులు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, ఒక మాజీ గవర్నర్‌తో సహా పలువురు పాప్యులర్ రాజకీయ నేతలు ఉన్నారు.
 
కాగా శుక్రవారం ఓటు వినియోగించుకోనున్న 16.63 కోట్ల మందిలో 8.4 కోట్ల మంది పురుషులు, 8.23 కోట్ల మంది మహిళలు, 11,371 మంది థర్డ్ జెండర్లు ఉన్నారు. 35.67 లక్షల మంది ఓటర్లు తొలిసారి ఓట్లు వేయబోతున్నారు. ఇక 85 ఏళ్లు పైబడిన వారు 14.14 లక్షల మంది నమోదిత ఓటర్లుగా ఉన్నారు.
 
తమిళనాడు (39), రాజస్థాన్ (12), ఉత్తరప్రదేశ్ (8), మధ్యప్రదేశ్ (6), ఉత్తరాఖండ్ (5), అరుణాచల్ ప్రదేశ్ (2), మేఘాలయ (2) రాష్ట్రాల్లోని అన్ని స్థానాలకు తొలి దశలో భాగంగా నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. అండమాన్-నికోబార్ దీవులు (1), మిజోరం (1), నాగాలాండ్ (1), పుదుచ్చేరి (1), సిక్కిం (1), లక్షద్వీప్ (1).. అసోం, మహారాష్ట్రలో 5, బీహార్ లో 4, పశ్చిమ బెంగాల్లో 3, మణిపూర్ 2, త్రిపుర, జమ్మూకశ్మీర్, ఛత్తీస్గఢ్లో ఒక్కో సీటుకు పోలింగ్ ప్రారంభమైంది.