1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 సెప్టెంబరు 2021 (20:43 IST)

సర్.. మా ఊరికి రోడ్డు వేసేంతవరకు పెళ్లి చేసుకోను: యువతి భీష్మ ప్రతిజ్ఞ

కర్నాటక రాష్ట్రానికి చెందిన ఓ యువతి భీష్మ ప్రతిజ్ఞ చేసింది. తమ గ్రామానికి రోడ్డు వేసేంత వరకు పెళ్ళి చేసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఇదే అంశాన్ని ఓ లేఖ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు.. కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైలకు వేర్వేరుగా రాసిన లేఖలో పేర్కొన్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లాలోని ఓ మారుమూల గ్రామం రాంపుర. 40 ఇళ్లు ఉన్న ఈ ఊరికి కనీస సౌకర్యాలు కూడా లేవు. సరైన రోడ్డు లేక బస్సులు రాక.. అక్కడ చాలా మంది పిల్లల చదువులు ఆగిపోయాయి.
 
పాఠశాలకు వెళ్లాలని భావించేవారు కనీసం ఏడు కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఆ గ్రామానికి రాకపోకల కోసం స్థానికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంధువులు కూడా అక్కడికి రావడం మానేశారు. రోడ్డు సమస్య వల్ల ఈ ఊరి యువతులను వివాహం చేసుకునేందుకు కూడా బయటివారు మొగ్గు చూపడం లేదు.
 
ఇక ఈ సమస్యలకు ఎలాగైనా పరిష్కారం కావాలని భావించిన బిందు అనే పెళ్లీడుకొచ్చిన యువతి.. తన గ్రామం పరిస్థితిని వివరిస్తూ ముఖ్యమంత్రి బసవరాజ్​ బొమ్మై, ప్రధాని నరేంద్ర మోడీలకు లేఖ రాశారు.
 
'మాది 40 ఇళ్లు ఉన్న ఓ చిన్న గ్రామం. ఇక్కడ ఎలాంటి సదుపాయాలు లేవు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా.. మా గ్రామం ఇంకా రోడ్ల సమస్యలను ఎదుర్కొంటోంది. దీనికి పరిష్కారం కోసమే నేను ముఖ్యమంత్రికి, ప్రధానికి లేఖ రాశాను' అంటూ యువతి బిందు పేర్కొంది. 
 
కాగా ఆమె లేఖకు కర్నాటక ముఖ్యమంత్రి కార్యాలయం తక్షణం స్పందించింది. రాంపుర గ్రామానికి ఉన్న రోడ్డు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. దీంతో సీఎం హామీపై బిందు హర్షం వ్యక్తం చేసింది.