బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 4 జూన్ 2019 (11:04 IST)

కేరళలో 'నిఫా' వైరస్... వైద్యుల పర్యవేక్షణలో 86 మంది రోగులు

కేరళ రాష్ట్రంలో నిఫా వైరస్‌ను గుర్తించారు. కొచ్చిన్‌కు చెందిన ఓ రోగిలో ఈ వైరస్‌ను గుర్తించినట్టు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి కెకె.శైలజ అధికారికంగా వెల్లడించారు. అలాగే, వైద్యుల పర్యవేక్షణలో మరికొంతమంది ఉన్నట్టు తెలిపారు. ఈ రోగి 23 యేళ్ల కాలేజీ విద్యార్థి అని చెప్పారు. 
 
ఇదే అంశంపై మంత్రి శైలజ మాట్లాడుతూ, నిఫా వైరస్ సోకిన రోగిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. ఆ రోగికి పూణెకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ విభాగం వైద్యులు జరిపిన పరిశోధనలో నిఫా వైరస్ సోకినట్టు తేలిందని, ఆ రోగిని ఎర్నాకులంలోని ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. 
 
దీనిపై మంత్రి శైలజ మాట్లాడుతూ, జ్వరం లక్షణాలతో ఇద్దరు ఆస్పత్రిలో చేరారు. వారిలో ఒకరికి నిఫా వైరస్ సోకినట్టు తేలింది. మరొకరు జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్నారని చెప్పారు. అయితే, ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్తలు చేపట్టామని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆమె తెలిపారు. ఇదిలావుండగా, కేరళ రాష్ట్ర వ్యాప్తంగా 86 మందిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు.