బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 15 ఆగస్టు 2019 (17:20 IST)

డబ్బులిస్తేనే సెల్ఫీ... ఎండీఎంకే వైగో సెల్ఫ్ గోల్

తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన నేతగా ఉన్న నేత వైగో అలియాస్ వై. గోపాలస్వామి(నాయుడు). ఈయన ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడుగా ఉన్నారు. డీఎంకేతో ఉన్న స్నేహ బంధం కారణంగా రాజ్యసభలో అడుగుపెట్టారు. ఈలం తమిళుల పక్షపాతి అనే ముద్ర పడిన వైగో ఇపుడు సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. తనతో సెల్ఫీ దిగేందుకు ఉత్సాహం చూపించే కార్యకర్తలు రూ.100 చొప్పున ఇవ్వాలనీ, డబ్బులు ఇవ్వని కార్యకర్తలతో సెల్ఫీ దిగేందుకు ఆయన నిరాకరించారు. ఈ వార్త ఆ నోటా ఈ నోటా పడి సోషల్ మీడియాకు చేరడంతో ఇది వైరల్ అయింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, పార్టీ నిధుల కోసం 'సెల్ఫీ విత్ వైగో' అనే కార్యక్రమాన్ని ఆ పార్టీ ప్రారంభించింది. ఇందులో భాగంగా వైగోతో సెల్ఫీ దిగాలంటే కార్యకర్తలు రూ.100 చెల్లించాలి. ఈ క్రమంలో కృష్ణగిరికి బయలుదేరిన వైగో అంబూరు పట్టణం వద్ద తన కాన్వాయ్‌ను ఆపారు. దీంతో కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత పలువు కార్యకర్తలు ఆయనతో సెల్ఫీ దిగేందుకు పోటీపడ్డారు. 
 
ఈ సందర్భంగా వైగో వారి దగ్గర రూ.100ను అడిగి తీసుకుని మరీ ఫొటో దిగారు. ఈ క్రమంలో వైగోతో ఫొటో దిగేందుకు ఓ కార్యకర్త రాగా, అతడిని ఎండీఎంకే అధినేత డబ్బులు అడిగారు. దీంతో తన వద్ద లేవని చెప్పడంతో వైగో అతనితో ఫొటో దిగకుండానే వెళ్లిపోయారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పలువురు నెటిజన్లతో పాటు తమిళ పార్టీలు కూడా వైగోపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఉత్సాహంగా వచ్చిన కార్యకర్తతో సెల్ఫీ దిగకుండా అతడిని అవమానించడం ఏంటని పలువురు వైగోను ప్రశ్నించారు.