శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 20 నవంబరు 2017 (21:27 IST)

థరూర్‌కి మిస్ వరల్డ్ మానుషి 'చిల్' సమాధానం... బిత్తరపోయిన శశి

17 ఏళ్ల తర్వాత భారతదేశ యువతి ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకుని వస్తే అంతా సంబరాలతో మానుషి చిల్లర్‌కు అభినందనలతో ముంచెత్తుతుంటే కేంద్ర మాజీ మంత్రి శశీ థరూర్ మాత్రం వంకరటింకర ట్వీట్ చేసి వార్తల్లో నిలిచారు. విశ్వసుందరిగా అవతరించిన మానుషి చిల్లార్‌ను

17 ఏళ్ల తర్వాత భారతదేశ యువతి ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకుని వస్తే అంతా సంబరాలతో మానుషి చిల్లర్‌కు అభినందనలతో ముంచెత్తుతుంటే కేంద్ర మాజీ మంత్రి శశీ థరూర్ మాత్రం వంకరటింకర ట్వీట్ చేసి వార్తల్లో నిలిచారు. విశ్వసుందరిగా అవతరించిన మానుషి చిల్లార్‌ను చిల్లరతో పోల్చుతూ ట్వీట్ చేశారు. ఇది వివాదాస్పదమైంది. దీనిపై నెటిజన్లు కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు. జాతీయ మహిళా కమిషన్ కూడా ఆగ్రహం వ్యక్తంచేసింది. 
 
శశిథరూర్ తన ట్వీట్‌లో ఏమని పేర్కొన్నారంటే.. "పెద్ద నోట్లను రద్దుచేసి ప్రభుత్వం ఎంత పెద్ద తప్పు చేసిందో ఇప్పటికైనా గుర్తెరిగితే మంచిది. మన ‘చిల్లర’కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని మానుషి ‘చిల్లర్’ ప్రపంచ సుందరిగా ఎన్నిక కావడంతో రుజువైంది’’ అని మానుషి చిల్లార్‌ను చిల్లరగా అభివర్ణిస్తూ ట్వీట్ చేశారు.
 
దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన మానుషి చిల్లార్‌ను చిల్లర వ్యక్తిగా పోల్చిన శశిథరూర్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. తాను చిల్లర వ్యక్తినని ఆయన మరోమారు తన వ్యాఖ్యలతో నిరూపించుకున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆయన వ్యాఖ్యలు బోడిగుండుకు మోకాలుకు ముడిపెట్టినట్టు ఉన్నాయని కొందరు కామెంట్ చేశారు. 
 
మానుషిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శశిథరూర్‌పై జాతీయ మహిళా కమిషన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. మానుషి విజయాన్ని తక్కువ చేసిన థరూర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఆయనకు సమన్లు జారీ చేయాలని నిర్ణయించింది. కాగా థరూర్ ట్వీట్ పైన ప్రపంచ సుందరి మానుషి తన ట్వీట్‌తో బిత్తరపోయేట్లు చేసింది. ఆమె ఏమని ట్వీట్ చేసిందంటే... ప్రపంచాన్ని గెలిచిన ఓ యువతికి ఇలాంటి వ్యాఖ్యలేమీ అసంతృప్తి కలిగించవని పేర్కొంది. చిల్లార్‌లో ‘చిల్’ ఉందన్న అంశాన్ని మరవకూడదంటూ ట్వీట్ చేసి శశిథరూర్‌కి చురక అంటించింది.