గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 4 డిశెంబరు 2019 (17:55 IST)

ఆ నలుగురు తోడేళ్ళను ప్రజలకు అప్పగించండి... జయాబచ్చన్

తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకున్న దిశ హత్య ఘటనపై రాజ్యసభ సభ్యురాలు, అమితాబ్ బచ్చన్ సతీమణి జయాబచ్చన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. దిశ హత్య ఘటన తనను కలచివేసింవదని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
దిశపై దారుణానికి ఒడిగట్టిన నలుగురు నిందితులను ఉపేక్షించకూడదని ఆమె డిమాండ్ చేశారు. నలుగురు నిందితుల వల్ల ప్రపంచంలో భారతీయులంతా తలదించుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆమె అభిప్రాయపడ్డారు. 
 
మహిళలపై దారుణాలకు ఒడిగట్టితే అలాంటి వారికి ఇతర దేశాల్లో ప్రజలే తగిన శిక్ష వేస్తున్నారని ఆమె గుర్తు చేశారు. దిశ హత్య కేసు ఘటనలో నిందితులను సైతం ప్రజలకే అప్పగించాలని ఆమె డిమాండ్ చేశారు. 
 
ఇతర దేశాల్లో ఎలాగైతే నిందితులను ప్రజలే శిక్షిస్తున్నారో అలాగే దిశ హత్య కేసు నిందితులను కూడా ప్రజలే శిక్షిస్తారన్నారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం ఏం సమాధానం చెప్తోందని ఆమె నిలదీశారు. 
 
న్యూఢిల్లీలో నిర్భయ ఘటన, తెలంగాణలో దిశ ఘటన, ఇటీవలే కథువా ఘటన ఇలా వరుసపెట్టి మహిళలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదని జయాబచ్చన్ సూటిగా ప్రశ్నించారు. 
 
దిశ ఘటన నిందితుల విషయంలో తాను కాస్త కఠినంగా రాజ్యసభలో మాట్లాడి ఉండొచ్చని కానీ అది తన ఆవేదన మాత్రమేనని జయాబచ్చన్ స్పష్టం చేశారు. నిందితులను ప్రజలకు అప్పగిస్తేనే ఇలాంటి ఘటనలు పునరావృతంకాకుండా ఉంటాయని జయాబచ్చన్ అభిప్రాయపడ్డారు.