శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 డిశెంబరు 2019 (20:40 IST)

ఢిల్లీలో గాలిపీల్చి సగం చచ్చిపోయాం.. ఇక మమ్మల్ని చంపేదేముంది.. నిర్భయ దోషి

నిర్భయ కేసులో దోషులుగా తేలినవారికి ఈ నెల 16వ తేదీన ఉరితీయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులు కాగా, అందులో ఒకరు మైనర్ బాలుడు. అతన్ని వదిలిపెట్టారు. ఈ కేసులో కీలక దోషి జైల్లో సూసైడ్ చేసుకున్నాడు. మిగతా నలుగురికి త్వరలో ఉరిశిక్ష అమలు చేయనున్నారు. 
 
ఈ నలుగురిలో ఒకడైన అక్షయ్ సింగ్ తనకు ఉరి విధించడంపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. అందులో అతడు పేర్కొన్న కారణాలు విడ్డూరంగా ఉన్నాయి. ఢిల్లీలోని వాయు కాలుష్యం, జల కాలుష్యం కారణంగా తమ ఆయుష్షు సగం క్షీణించిందని, ఇంకా తమకు ఉరిశిక్ష ఎందుకని పిటిషన్‌లో పేర్కొన్నాడు. 
 
కాలుష్యం కారణంగా ఢిల్లీ గ్యాస్ చాంబర్‌ను తలపిస్తోందని, నీళ్లు సైతం విషపూరితంగా మారిపోయాయని, ఇలాంటి పరిస్థితుల్లో ఆయుర్దాయం తగ్గిపోతుంటే ప్రత్యేకంగా మరణశిక్ష అవసరమా? అంటూ పైత్యం ప్రదర్శిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
ఈ తాజా పిటిషన్‌తో నిర్భయ కేసులో ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న ఉరిశిక్ష అమలవుతుందా లేదా అన్నది మరోసారి సందేహాస్పదంగా మారింది. ఇప్పటికే ఈ రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు కాగా... సుప్రీంకోర్టు రిజిస్ట్రీ దీన్ని స్వీకరించింది. కాగా ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు వినయ్, పవన్ కుమార్ గుప్తా ప్రస్తుతానికి సుప్రీంకోర్టులో ఉపశమనం కోసం పిటిషన్ దాఖలు చేయలేదు.
 
ఇదే అంశంపై నిందితుల తరపు న్యాయవాది మాట్లాడుతూ.. అక్షయ్ రివ్యూ పిటిషన్‌పై ఏ సంగతీ తేలిన తర్వాతే మిగతా నిందితులు కలిసికట్టుగా క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేస్తారని తెలిపారు. కాగా ఈ కేసులోని మరో నిందితుడు పవన్ గుప్తాను ఇప్పటికే మండోలీ జైల్ నుంచి తీహార్ జైలుకు తరలించారు. 
 
గుప్తాతో పాటు మరో ఇద్దరు నిందితులు ముఖేశ్ సింగ్, అక్షయ్ ప్రస్తుతం రెండో నెంబర్ తీహార్ జైల్లో ఉన్నారు. మరో నిందితుడు వినయ్ శర్మను నాలుగో నంబర్ తీహార్ జైల్లో ఉంచినట్టు అధికారులు వెల్లడించారు. వీరందరినీ ఒకేసారి ఉరితీసేందుకు జైలు అధికారులు ఏర్పాట్లు చేసినట్టు సమాచారం.