శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 9 నవంబరు 2017 (14:56 IST)

#OddEven : ఢిల్లీలో విషవాయువులు.. 13 నుంచి సరిబేసి విధానం..

దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం కమ్మేసింది. ఈ నేపథ్యంలో నగరంలో ఈనెల 14 వరకు ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదు అని గ్రీన్ ట్రిబ్యునల్ గురువారం ఆదేశాలు జారీచేసింది. కాలుష్యాన్ని నియంత్రించడంలో ఢిల్లీ ప్రభుత్వ

దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం కమ్మేసింది. ఈ నేపథ్యంలో నగరంలో ఈనెల 14 వరకు ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదు అని గ్రీన్ ట్రిబ్యునల్ గురువారం ఆదేశాలు జారీచేసింది. కాలుష్యాన్ని నియంత్రించడంలో ఢిల్లీ ప్రభుత్వం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు దారుణంగా విఫలమయ్యాయని గ్రీన్ ట్రిబ్యునల్ మండిపడింది. 
 
ఎన్‌జీటీ ఛైర్మన్ స్వతంతర్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వం కానీ, ఏదైనా సంస్థ కానీ, లేదా వ్యక్తులు కానీ ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదు అని ట్రిబ్యునల్ ఆదేశించింది. పీఎం లెవల్స్ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో నీళ్లు చల్లాలని ట్రిబ్యునల్ సూచన చేసింది. అలాగే, సీమెంటు, ఇసుక తీసుకువెళ్లే ట్రక్కులను నిషేధించారు.
 
మరోవైపు ఢిల్లీ రోడ్లపై వాహనాల సంఖ్యను క్రమబద్దీకరించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ సరిబేసి సంఖ్యా విధానాన్ని తెరపైకి తెచ్చింది. ఈనెల 13వ తేదీ నుంచి ఈ విధానాన్ని అమలు చేయనున్నట్టు ఢిల్లీ రాష్ట్ర రవాణా మంత్రి కైలాష్ గెహ్లాట్ తెలిపారు. వారంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు. 
 
ఇంకోవైపు ఢిల్లీ ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా విమర్శలు గుప్పించారు. ఢిల్లీలోని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ పూర్తిగా విఫలమైందంటూ ట్వీట్ చేశారు. తన వ్యాఖ్యలతో ఏకీభవిస్తే రీట్వీట్ చేయాలంటూ ఆయన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. దీనికి అనేక మంది బీజేపీ సర్కారు కంటే మేలంటూ రీట్వీట్స్ చేయడం గమనార్హం.