గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 11 సెప్టెంబరు 2017 (12:17 IST)

ర్యాన్ స్కూల్‌ ఘటన : మీడియాపై హర్యానా పోలీసుల జులుం... ప్రిన్సిపాల్ అరెస్ట్

ఢిల్లీ శివారుల్లోని గురుగ్రామ్‌లో ప్రద్యుమన్‌ ఠాకూర్(7) హత్యా ఉదంతం హర్యానా రాష్ట్రాన్ని ఓ కుదుపు కుదిపింది. పాఠశాల ఆవరణలోనే విద్యార్థిని గొంతు కోసి హత్య చేయటంతో విద్యార్థులతో పాటు స్థానికులు ఆగ్రహావ

ఢిల్లీ శివారుల్లోని గురుగ్రామ్‌లో  ప్రద్యుమన్‌ ఠాకూర్(7) హత్యా ఉదంతం హర్యానా రాష్ట్రాన్ని ఓ కుదుపు కుదిపింది. పాఠశాల ఆవరణలోనే విద్యార్థిని గొంతు కోసి హత్య చేయటంతో విద్యార్థులతో పాటు స్థానికులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు, పలు విద్యార్థి సంఘాలు రెండు రోజుల పాటు నిరసన ప్రదర్శనలకు పిలుపునివ్వగా గుర్‌గ్రామ్‌తోపాటు చుక్కల పక్కల ప్రాంతాల్లోని పాఠశాలలన్నీ మూతపడ్డాయి. ఈ ఘటనకు  సంబంధించి రీజీనల్‌ హెడ్‌, హెచ్‌ఆర్‌ హెడ్‌లను అరెస్ట్ చేసినట్లు సమాచారం.
 
ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ర్యాన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌‌ వద్ద భారీ భద్రతను కల్పించారు. మరోవైపు.. స్కూల్లో వసతులు సరిగ్గా లేవని, కనీసం సీసీ కెమెరాలు కూడా సరిగ్గా పని చేయటం లేదని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. బస్సు కండక్టర్‌ ప్రవర్తనను పరిశీలించకుండానే స్కూల్‌ యాజమాన్యం విధుల్లోకి తీసుకుందని వెల్లడైంది. ‘సెక్సువల్ ప్రవర్తన’ కారణంగా అతన్ని ఇంతకు ముందు పని చేసిన స్కూల్‌ యాజమాన్యం విధుల నుంచి తొలగించిన విషయం వెలుగుచూసింది. ఈ ఘటనపై వీడియో చిత్రీకరిస్తున్న మీడియా సిబ్బందిపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో మీడియా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. 
 
ఇంకోవైపు, ఇక స్కూల్‌ యాజమాన్యంపై జువైనల్‌ జస్టిస్‌ యాక్ట్  సెక్షన్‌ 75 కింద కేసు నమోదైనట్లు విద్యాశాఖా మంత్రి రాం విలాస్‌ శర్మ ప్రకటించారు. స్కూల్‌ యాజమాన్యంతోపాటు, నిర్వాహకుల పేర్లు కూడా ఛార్జ్‌షీట్‌లో నమోదైనట్లు ఆయన వెల్లడించారు. అయినప్పటికీ శాంతించని తల్లిదండ్రులు సీబీఐ దర్యాప్తు జరిపించాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. ఆదివారం పేరెంట్స్‌ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసి ఓ వైన్‌ షాపును తగలబెట్టగా, లాఠీఛార్జీలో పలువురు మీడియా సిబ్బందికి కూడా గాయాలయ్యాయి.