శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 17 జులై 2018 (14:32 IST)

మైనస్ మార్కులొచ్చినా... "నీట్‌"గా డాక్టర్ అయిపోవచ్చు... ఎలా?

దేశంలోని వైద్య విద్యా కోర్సుల ప్రవేశానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నేషనల్ ఎలిజిబులిటీ ఎంట్రెన్స్ టెస్ట్- ఎన్.ఈ.ఈ.టి.)ని ప్రవేశపెట్టింది. గత 2017 నుంచి అమల్లోకి వచ్చిన ఈ విద్యా విధాన

దేశంలోని వైద్య విద్యా కోర్సుల ప్రవేశానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నేషనల్ ఎలిజిబులిటీ ఎంట్రెన్స్ టెస్ట్- ఎన్.ఈ.ఈ.టి.)ని ప్రవేశపెట్టింది. గత 2017 నుంచి అమల్లోకి వచ్చిన ఈ విద్యా విధానంలోని డొల్లతనం రోజులు గడిచేకొద్దీ బయటపడుతోంది. 2017లో నిర్వహించిన నీట్ పరీక్షలో ఫిజిక్స్, కెమిస్ట్రీలలో కేవలం సింగిల్ డిజిట్ మార్కులు తెచ్చుకున్న దాదాపు 400 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీటును సాధించారు.
 
ఇంకా దారుణం ఏమిటంటే... సున్నా మార్కులు లేదా నెగెటివ్ మార్కులు తెచ్చుకున్న 110 మంది విద్యార్థులు ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో అడ్మిషన్ పొందారు. ఈ నేపథ్యంలో, నీట్ పరీక్ష అర్హతపై పలు అనుమానాలు కలుగుతున్నాయి.
 
తాజాగా వెలువడిన నివేదిక ప్రకారం... 2017లో ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 530 మంది సింగిల్ డిజిట్ లేదా సున్నా లేదా నెగెటివ్ స్కోరును సాధించారు. ఈ 530 మంది విద్యార్థుల్లో 507 మంది ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో చేరారు. 
 
నీట్ ఎగ్జామ్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల్లో కటాఫ్ మార్కులు లేకపోవడం గమనార్హం. ప్రతి పేపర్‌లో కనీసం ఇన్ని మార్కులు సాధించాలనే షరతులు ఈ ప్రవేశ పరీక్షలో లేవు. ఈ నేపథ్యంలో, ఏడాదికి రూ.17 లక్షల ఫీజు చెల్లించగల స్తోమత ఉన్నవారంతా... మార్కులతో సంబంధం లేకుండా ఎంబీబీఎస్ కోర్సులో చేరిపోతున్నారు. 
 
వాస్తవానికి కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో ప్రతి సబ్జెక్ట్ లో 50 శాతానికి మించి (రిజర్వ్‌డ్ కేటగిరీలకు 40 శాతం) మార్కులు వస్తేనే మెడిసిన్ లేదా డెంటల్ కాలేజీలలో ప్రవేశానికి అర్హత ఉంటుంది. 2012లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కొత్త ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే సున్నా మార్కులు వచ్చిన శ్రీమంతులు డాక్టర్ పట్టా పుచ్చుకునే అవకాశం ఏర్పడింది. దీనిపై, సర్వత్ర ఆశ్చర్యంతో పాటు ఆగ్రహావేశాలు కూడా వ్యక్తమవుతున్నాయి.