బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 9 అక్టోబరు 2017 (06:15 IST)

అంతా భోళాశంకరుడి ఆశీస్సులే : ప్రధాని నరేంద్ర మోడీ

తనకు భోళాశంకరుడి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. గుజరాత్‌ పర్యటనలో భాగంగా రెండోరోజు ఆదివారం మెహసానా జిల్లాలోని తన జన్మస్థలమైన వడ్‌నగర్‌ పట్టణంలో పర్యటించారు. ప్రధాని పద

తనకు భోళాశంకరుడి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. గుజరాత్‌ పర్యటనలో భాగంగా రెండోరోజు ఆదివారం మెహసానా జిల్లాలోని తన జన్మస్థలమైన వడ్‌నగర్‌ పట్టణంలో పర్యటించారు. ప్రధాని పదవి చేపట్టాక ఆయనిక్కడకు రావడం ఇదే తొలిసారి. 
 
పట్టణ శివారులోని హెలిప్యాడ్‌ నుంచి కొత్తగా నిర్మించిన వైద్య కళాశాల వరకు భారీ రోడ్‌షో నిర్వహించారు. ప్రజలు భారీసంఖ్యలో తరలివచ్చారు. వీధులన్నీ ‘మోడీ’ నామస్మరణతో మార్మోగాయి. దారిపొడవునా ఆయనపై పుష్పవర్షం కురిపించారు. ఇక్కడ కొత్తగా నిర్మించిన వైద్య కళాశాలను ప్రధాని ప్రారంభించారు. వ్యాధినిరోధక టీకా కార్యక్రమానికి శ్రీకారం కూడా చుట్టారు. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగించారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'నా జన్మస్థలం వడ్‌నగర్‌ నుంచి నా ప్రయాణం ప్రారంభమైంది. ఇప్పుడు కాశీ చేరాను. వడ్‌నగర్‌లాగే కాశీ కూడా మహాశివుడి నగరం. భోళాశంకరుడి ఆశీస్సులు నాకు అపరిమిత శక్తిని చేకూర్చాయి. హాలాహలం మింగి జీర్ణం చేసుకునే బలాన్నిచ్చాయి. నా జన్మస్థలం నుంచి నేను పొందిన అతిపెద్ద వరం ఈ బలమే. 2001 నుంచి నాపై విషం చిమ్మినవారందరినీ ఆ బలంతోనే ఎదుర్కొని నిలబడ్డాను. ఆ సామర్థ్యమే నా మాతృభూమికి ఇన్నేళ్లుగా అంకితభావంతో సేవ చేసే శక్తిని ప్రసాదించింది' అని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. 
 
తాను చదువుకున్న బీఎన్‌ ఉన్నత పాఠశాలను ప్రధాని మోడీ ఆదివారం సందర్శించారు. స్కూలులోకి అడుగుపెట్టగానే.. అక్కడి నేలపై ఉన్న ఇసుకను తన నుదుటన రాసుకున్నారు. సుప్రసిద్ధ హఠకేశ్వర్‌ మహాదేవ్‌ ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. త్వరలో గుజరాత్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గత నెల రోజుల్లో మోడీ మూడోసారి పర్యటించడం విశేషం.