శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 13 ఆగస్టు 2020 (15:59 IST)

పుట్టుకతోనే అంధురాలు పూర్ణ సుందరి .. సివిల్స్‌లో ర్యాంకు... క్రికెటర్ కైఫ్ ప్రశంసలు

ఇటీవల యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించన సివిల్స్ 2019 ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో అనేక మంది అభ్యర్థులు ఒకే ఒక్క ప్రయత్నంలోనే తమ లక్ష్యాన్ని చేరుకున్నారు. మరికొందరు రెండు నుంచి ఐదారుసార్లు ప్రయత్నించి సివిల్స్ ర్యాంకు సాధించారు. ఇలాంటి వారిలో పూర్ణ సుందరి ఒకరు. తమిళనాడు రాష్ట్రంలోని మదురైకు చెందిన ఈ పూర్ణ సుందరి.. పుట్టుకతో అంధురాలు. కానీ, ఆమె వినికిడి ద్వారానే సివిల్స్‌కు సిద్ధమై... పరీక్షలు రాసింది. ఈ ఫలితాల్లో ఆమె లక్ష్యాన్ని చేరుకుంది. ఏకంగా 286వ ర్యాంకును కైవసం చేసుకుంది. కేవలం ఆడియో పాఠాలు విని ఆమె సివిల్స్‌లో ఉత్తీర్ణురాలవడం దేశవ్యాప్తంగా అనేకమందిని అచ్చెరువొందించింది.
 
ఈ విషయం టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ దృష్టికి చేరింది. పూర్ణ సుందరి ఘనతను కొనియాడుతూ ట్విట్టర్ ఖాతాలో తన స్పందన తెలిపారు. 'తమిళనాడుకు చెందిన పాతికేళ్ల పూర్ణ సుందరి పరిస్థితులకు ఎదురొడ్డి యూపీఎస్సీ నియామకాల్లో ర్యాంకు సాధించింది. ఆడియో పాఠాలు దొరకడమే కష్టమైన కాలంలో ఆమెకు తల్లిదండ్రులు, స్నేహితులే అండగా నిలిచారు. పుస్తకాలను ఆడియో పాఠాల రూపంలో మలిచి సాయపడ్డారు. ఆ విధంగా ఎంతో కష్టపడిన పూర్ణ సుందరి ఇప్పుడు సివిల్ సర్వీసెస్ అధికారిణి అవుతోంది. మీ కలలను సాకారం చేసుకునే క్రమంలో ఎప్పుడూ పరుగును ఆపొద్దు" అంటూ కైఫ్ పేర్కొన్నారు.
 
తమిళనాడులోని మదురై ప్రాంతానికి చెందిన పూర్ణ సుందరి సివిల్స్ రాయడం ఇది నాలుగోసారి. తన నాలుగో ప్రయత్నంలో ఆమె మెరుగైన ర్యాంకును అందుకుని తన కలను నిజం చేసుకున్నారు. ఈ పరీక్షలో నెగ్గడానికి ఐదేళ్ల పాటు కృషి చేశానని, ఈ విజయాన్ని తల్లిదండ్రులకు అంకితం ఇస్తున్నానని, వారు తనకోసం ఎంతో కష్టపడ్డారని పూర్ణ సుందరి మీడియాకు తెలిపారు.