శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Modified: శనివారం, 12 జనవరి 2019 (17:16 IST)

చెన్నైలో బైక్‌ను ఢీకొట్టిన కారు... కాలు లేని శవం 420 కి.మీ దూరంలో ఏపీలో లభ్యం...

మసకబడితే చాలు... వాహనాలు నడిపేవారిలో చాలామందికి కన్నూమిన్నూ కానరావడంలేదు. స్టీరింగ్ పట్టుకుని ఏది అడ్డం వచ్చినా ఢీకొట్టుకుంటూ వెళ్లిపోతున్నారు. ఇలాంటివారి వల్ల ఎందరో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. కుటుంబానికి ఆధారంగా వున్న ఎంతోమందిని తమ వాహనాలతో ఢీకొట్టి చంపేస్తున్నారు ఇలాంటి రోడ్ రోగ్స్. కారులో అత్యంత వేగంగా ప్రయాణిస్తూ వచ్చి ఆఫీసు ముగించుకుని వెళ్తున్న ఓ వ్యక్తిని ఢీకొట్టి... కనీసం అతడేమయ్యాడో చూడకుండా అత్యంత వేగంతో వెళ్లిపోయాడా ఢీకొట్టిన వ్యక్తి.
 
గురువారం నాడు చెన్నై శివార్లలో జరిగిన హృదయవిదారక సంఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. తమిళనాడు తిరువళ్లూరు జిల్లా పండూర్‌కి చెందిన సుధాకర్ అనే వ్యక్తి గురువారం రాత్రి ఆఫీసు విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్నాడు. ఆ సమయంలో ఓ కారు అత్యంత వేగంతో వచ్చి అతడిని ఢీకొట్టింది. ఆ వేగానికి బైకు నుజ్జునుజ్జు కాగా సుధాకర్ కాలు తెగి ఎగిరిపోయి రోడ్డుకి ఆవల పడింది. అంతేకాదు... అతడి శవం హైవేపై వెళ్తున్న ఓ కార్గో లారీపై పడిపోయింది. 
 
కారుతో ఢీకొట్టిన వ్యక్తి మోటార్ బైకు నుజ్జునుజ్జు కావడాన్ని చూసి ఇక దానిపై ప్రయాణించిన వ్యక్తి బతికే చాన్స్ లేదని అంతకుమించిన వేగంతో వెళ్లిపోయాడు. మరోవైపు తన కార్గో లారీపైన మృతుడి శరీర వుందని తెలుసుకోలేని కార్గో లారీ డ్రైవర్ ఆ బాడీతో ఏకంగా 420 కి.మీ ప్రయాణించాడు. వాహనం కర్నూలుకు చేరుకోగానే అక్కడ సరుకు దించేందుకు పైకి ఎక్కి చూడగా రక్తస్రావంతో ఓ కాలు లేకుండా వున్న మృతదేహం చూసి జడుసుకున్నాడు. విషయాన్ని పోలీసులకు అందించాడు. 
 
ఇంతలో చెన్నై పండూర్‌లో సుధాకర్ కాలు మాత్రమే కనబడటం... శవం లభ్యం కాకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు, బంధువులు పోలీసు స్టేషను ముందు ఆందోళనకు దిగారు. ఇదిలావుండగా ఆంధ్ర పోలీసుల నుంచి జాతీయ రహదారి ప్రక్కనే వున్న పోలీసు స్టేషన్లన్నిటికీ ఓ సందేశం వచ్చింది. అదేమంటే.. కాలు లేని ఓ శవం కర్నూలులో లభ్యమైందని. శవం ఫోటోలను కూడా పంపండంతో అది సుధాకర్‌దేనని గుర్తించిన అతడి కుటుంబ సభ్యులు భోరుమంటూ విలపించారు. ఆ ప్రాంతమంతా దుఃఖసాగరంలో మునిగిపోయింది. కానీ ఢీకొట్టిన కారు రోడ్ రోగ్ ఎవరనేది తెలియలేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.