శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 1 అక్టోబరు 2020 (09:10 IST)

కోవిడ్-19 టెస్టుల్లో రకాలు - ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అంశాలు

కోవిడ్-19 వైరస్ వచ్చి దాదాపు ఆరు నెలలు దాటింది. దేశ వ్యాప్తంగా రోజువారీగా 70 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి.

ఇప్పటికీ చాలా మంది బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం, భౌతిక దూరం లాంటి నియమాలను పెద్దగా పాటించడం లేదు. కోవిడ్ వ్యాప్తికి ఇదీ ఒక కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్-19 లక్షణాలు కనిపిస్తే ఎలాంటి పరీక్షలు చేస్తారన్న దానిపైనా ప్రజలు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. 
 
1. ఆర్టీపీసీఆర్ టెస్ట్: 
దీన్ని రియల్‌ టైమ్‌ పాలిమరైజ్‌ చైన్‌ రియాక్షన్‌ అంటారు. ఈ పరీక్షని ముక్కు లేదా గొంతులోని స్వాబ్ తీసి పరీక్షిస్తారు. ఫలితం రావడానికి 2-3 రోజులు పడుతుంది. ఈ పరీక్షలో పాజిటివ్ వస్తే 100% పాజిటివ్ అనే అర్ధం. నెగిటివ్ వస్తే 99% నెగిటివ్ అని అర్ధం. వైరస్‌ నిర్ధారణలో ప్రపంచంలోనే ఇది అత్యుత్తమ పద్ధతిగా ప్రస్తుతం గుర్తిస్తున్నారు.   
 
2. ట్రూనాట్ పరీక్ష:
ఆర్టీపీసీఆర్ మాదిరిగానే పనిచేస్తుంది. అలాగే వేగంగా ఫలితాలను ఇస్తుంది. కోవిడ్ -19 కోసం స్క్రీనింగ్ మరియు నిర్ధారణ కోసం ఈ పరీక్ష చేస్తారు. ఇది కూడా నోరు లేదా ముక్కు నుండి స్వాబ్ తీసి పరీక్షిస్తారు. 
 
3. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్: 
ఈ పరీక్ష కూడా స్వాబ్ ద్వారానే పరీక్షస్తారు. కానీ ఫలితం 15 నిమిషాల్లో తెలుస్తుంది. ఈ పరీక్షలో పాజిటివ్ వస్తే 100% పాజిటివ్ అనే అర్ధం. నెగిటివ్ వచ్చి, కోవిడ్ లక్షణాలు తగ్గకపోతే తప్పకుండా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. 
 
4. హెచ్చార్సీటీ-లంగ్స్ (సిటి స్కాన్ ): 
యాంటిజెన్ పరీక్షలో నెగిటివ్ వచ్చినప్పటికీ హెచ్చార్సీటీ చెస్ట్ప పరీక్షలో పాజిటివ్ వచ్చిన కేసులు చాలా వున్నాయి. హెచ్చార్సీటీ ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్ ఎంత వుందన్న దానితోపాటు స్కోరింగ్ కూడా రిపోర్ట్ లో వస్తుంది. ఇది కూడా ముఖ్యమైన పరీక్ష. 
 
5. యాంటిబాడీ టెస్ట్: 
ఈ పరీక్షని రక్త నమూనాలను సేకరించి చేయడం జరుగుతుంది. ఫలితం ఒక రోజు లోపే వస్తుంది. దీని ద్వారా వచ్చే ఫలితం సరి అయినది కాదు. కావున కోవిడ్ ని నిర్ధారించుకోవడానికి యాంటీబాడీ పరీక్షలను ఎప్పుడూ చేయించుకోకండి.
 
కోవిడ్ వచ్చిందా? లేదా? అని తెలుసుకునేందుకు యాంటిజెన్ లేదా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. వైరస్ ఎంత మందికి వచ్చింది? హెర్డ్ ఇమ్యూనిటీ ఎలా ఉంది? ప్లాస్మా థెరపీకి ప్లాస్మా ఇవ్వొచ్చా? అని తెలుసుకోవడానికి యాంటిబాడి టెస్టులు చేయాలి. సిటీస్కాన్ కోవిడ్ ను నిర్ధారించలేదు. ఎవరైనా సిటీస్కాన్ రిపోర్టు ఆధారంగా ప్రభుత్వానికి తెలియపరచకుండా వైద్యం చేసినా శిక్షార్హులని ఇదివరకే ప్రభుత్వం స్పష్టం చేసింది. 
 
వైద్యం మరియు కౌన్సిలింగ్ చాలా అవసరం
చాలా మంది వాట్సప్, యూట్యూబ్, ఫేస్బుక్ వేదికగా వస్తున్న సమాచారం ఆధారంగా సొంత నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదకరం. కరోనా గురించి అనుమానాలున్నా, కోవిడ్ సోకినా తప్పనిసరిగా నిపుణుల సలహాలు, కౌన్సిలింగ్ తీసుకోవాలి. తదనుగుణంగానే మందులు వాడాలి.

ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా 104, 1902 కాల్ సెంటర్లతోపాటు ఆన్ లైన్ లో వైద్య సహాయం పొందడానికి వైఎస్ఆర్ టెలీమెడిసిన్ 14410 నంబర్, 8297104104 హెల్ప్ లైన్ నంబర్ ను అందుబాటులో ఉంచింది. ఈ నంబర్లకు కాల్ చేసి కోవిడ్ కు సంబంధించిన సమాచారంతోపాటు ఆస్పత్రుల వివరాలు కూడా తెలుసుకోవచ్చు.