గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 22 ఏప్రియల్ 2019 (09:57 IST)

రంజన్ గొగోయ్‌పై కుట్రకు భారీ ముడుపులు.. వెల్లడించిన సుప్రీంకోర్టు లాయర్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌ను ఆ పదవి నుంచి తొలగించేందుకు భారీ స్థాయిలో కుట్ర సాగుతోందని సుప్రీంకోర్టు న్యాయవాది ఉత్సవ్ బెయిన్స్ ఆరోపించారు. పైగా, ఈ కేసులో తనను భాగస్వామి చేసేందుకు ఓ వ్యక్తి తనను సంప్రదించాడని వెల్లడించారు. అంతేకాకుండా, సీజేఐ గొగోయ్‌పై ఓ మహిళ చేసిన లైంగిక ఆరోపణల కేసును విచారిస్తే రూ.1.50 కోట్ల ముడుపుల ఇవ్వజూపారని ఆయన తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. 
 
సీజేఐ రంజన్ గొగోయ్‌ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ సుప్రీంకోర్టు మాజీ మహిళా ఉద్యోగి 22 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు అఫిడవిట్ రూపంలో ఓ ఫిర్యాదు చేసింది. దీనిపై శనివారం సీజేఐ గొగోయ్‌ స్పందిస్తూ.. న్యాయ వ్యవస్థకు పెనుముప్పు పొంచి ఉందని, తన ను అస్థిరపరిచేందుకు 'చాలా పెద్ద శక్తి' పన్నాగం పన్నుతోందని ఆవేదన, ఆక్రోశం వ్యక్తం చేశారు. 
 
పైగా, ఈ కేసును విచారించేందుకు స్వీయ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ ధర్మాసనం ఈ కేసును అత్యవసర కేసుగా విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో బెయిన్స్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సీజేఐ చేసిన వ్యాఖ్యలకు మరింత బలాన్నిచ్చేలా ఉన్నాయి. ఈ కేసును వాదించేందుకు తొలి దశలో రూ.50 లక్షలు లీగల్ ఫీజు ఇచ్చేందుకు, ఆ తర్వాత రూ.1.50 కోట్ల ముడుపులు ఇచ్చేందుకు సమ్మతించాడని ఆయన వెల్లడించారు.