శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 21 జులై 2019 (17:22 IST)

విద్యుత్ శాఖ లీలలు... పేదోడి ఇంటికి రూ.128 కోట్ల కరెంట్ బిల్లు

సాధారణంగా పేదోడి ఇంటికి ఓ ఫ్యాన్, ఓ లైటు ఉంటాయి. వీటిని ఉపయోగిస్తే మహా అయితే వంద లేదా రెండు వందల రూపాయల మేరకు కరెంట్ బిల్లు వస్తుంది. కానీ, ఆ పేదోడి ఇంటికి మాత్రం అక్షరాలా రూ.128 కోట్ల బిల్లు వచ్చింది. ఈ బిల్లును చూడగానే కుటుంబ యజమానికి గుండె ఆగినంత పని అయింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని హపూర్‌కు చెందిన షమీమ్ అనే వృద్ధుడు తన భార్యతో కలిసి ఓ చిన్నపాటి ఇంటిలో నివసిస్తున్నాడు. ఒక రోజు కరెంట్ వాళ్లు వచ్చి.. కనెక్షన్ కట్ చేస్తుంటే ఎందుకని షమీమ్ ప్రశ్నించాడు. మీ బిల్లు చూడలేదా.. ఆ మొత్తం కట్టే వరకు కనెక్షన్ ఇచ్చేది లేదని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
 
తీరా, తన ఇంటి కరెంట్ బిల్లును నిశితంగా పరిశీలిస్తే గానీ ఆయన అసలు విషయం అర్థంకాలేదు. బిల్లు చూడగానే ఆయన గుండె ఆగినంతపని అయింది. దీనిపై ఫిర్యాదు చేయడానికి వెళితే... అదంతా తెలియదు బిల్లు కట్టాల్సిందేనని పట్టుబట్టారు. నెత్తినోరు మొత్తుకున్నా అక్కడ వినేవాడే లేకుండా పోయాడు. 
 
చివరకిది ఆ నోటా.. ఈ నోటా పడి.. మీడియాకు చేరడంతో అసలు విషయం బయటపడింది. అదంతా సాంకేతిక సమస్య కారణంతో జరిగిందని అధికారులు చేతులు దులిపేసుకున్నారు. కరెంట్ కనెక్షన్ అందిస్తామని తెలిపారు. అధికారుల తీరుపై షమీమ్ మండిపడ్డాడు. కరెంట్ వాళ్లు తమ ఇంటికేగాక.. మొత్తం హపూర్ నగరం బిల్లంతా తనకే ఇచ్చారని షమీమ్ ఎద్దేవా చేస్తున్నాడు.