1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 29 ఏప్రియల్ 2018 (15:46 IST)

రైతులు చచ్చిపోతుంటే బీజేపీకి చీమకుట్టినట్టు కూడా లేదు : సోనియా

దేశవ్యాప్తంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే అధికార భారతీయ జనతా పార్టీకి చీమకుట్టినట్టు కూడా లేదని కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ మండిపడ్డారు. ఆదివారం ఉదయం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్ర

దేశవ్యాప్తంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే అధికార భారతీయ జనతా పార్టీకి చీమకుట్టినట్టు కూడా లేదని కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ మండిపడ్డారు. ఆదివారం ఉదయం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ నిర్వహించిన జన్ ఆక్రోశ్ ర్యాలీలో ఆమె పాల్గొని ప్రసంగించారు.
 
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారుపై ఆమె మాటల దండయాత్ర చేశారు. మోడీ పాలనలో సమాజంలోని అన్ని వర్గాలు తీవ్ర ఇక్కట్ల పాలయ్యాయని ఆరోపించారు. యువతను, రైతులను మోడీ వంచించారన్నారు. 
 
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమ్మాయిలకు, మహిళలకు ఆ పార్టీ ఎమ్మెల్యేల నుంచి రక్షణ లేకుండా పోయిందన్నారు. అలాంటి రేపిస్టులకు నరేంద్ర మోడీ కొమ్ముకాస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
అంతేకాకుండా అధికారంలోకి వస్తే యేడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తానంటూ నమ్మించిన మోడీ.. గత నాలుగున్నరేళ్ళలో లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేక పోయారని ఆరోపించారు. ఫలితంగా నిరుద్యోగం బాగా పెరిగిపోయిందన్నారు. అలాగే దేశ వ్యాప్తంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయినా బీజేపీకి చీమ కుట్టినట్టు కూడా లేదంటూ మండిపడ్డారు. 
 
మోడీ పాలనలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని, చిన్నారి బాలికలకు కూడా రక్షణ లేకుండా పోయిందని  సోనియా ఆరోపించారు. ఇందుకు పాల్పడిన వారు మాత్రం ఈ ప్రభుత్వ హయాంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆరోపించారు. బీజేపీ పాలనకు వ్యతిరేకంగా దేశప్రజలంతా ఏకం కావాలని ఆమె పిలుపునిచ్చారు.