శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 29 ఏప్రియల్ 2018 (14:30 IST)

ప్రజల కళ్లలో మోడీపై ఆగ్రహం స్పష్టంగా కనిపిస్తోంది : రాహుల్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజల వద్ద వసూలు చేసిన డబ్బంతా సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ జేబులోకి వెళ్లిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. అంతేకాకుండా, అధికారంలోకి వచ్చి నాల

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజల వద్ద వసూలు చేసిన డబ్బంతా సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ జేబులోకి వెళ్లిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. అంతేకాకుండా, అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళు పూర్తయినా తప్పుడు హామీలతో దేశ ప్రజలను ప్రధాని మోడీ ఇంకా మభ్య పెట్టాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు.
 
ఆదివారం ఉదయం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్‌ జన్‌ ఆక్రోశ్‌ ర్యాలీలో రాహుల్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మోడీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 'దేశంలో వెళ్లిన ప్రతీ చోటల్లా నేను ప్రజలను అడిగేది ఒక్కటే. మోడీ పాలనలో సంతోషంగా ఉన్నారా? అని.. వారందరి నుంచి ముక్తకంఠంతో వినిపించే సమాధానం ఒక్కటే. లేదు అని.. ప్రజల కళ్లలో మోడీపై ఆగ్రహం స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి' అని రాహుల్‌ ధ్వజమెత్తారు. 
 
పైగా, మోడీ పర్యటించిన చోటంతా తప్పుడు హామీలు ఇస్తున్నారు. ఆయన మాటల్లో నిజాలు మచ్చుకైనా కనిపించవు. నేరస్థులకు టికెట్లు ఇచ్చిన ఘనత కూడా మోడీదే. జైలుకు వెళ్లిన వ్యక్తిని సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. అమిత్‌ షా కుమారుడి ఆస్తులు కొన్ని నెలలో ఎలా రెట్టింపు అయ్యాయి? ప్రజలు బ్యాంకుల్లో దాచుకున్న సొమ్మును నీరవ్‌ మోడీ దోచుకెళ్లాడు. అయినా చౌకీ దార్‌(మోదీని ఉద్దేశించి) మాత్రం స్పందించరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.