1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 ఏప్రియల్ 2020 (17:47 IST)

తండ్రి అంత్యక్రియల కంటే 23 కోట్ల మంది ప్రజలను రక్షించాలి : సీఎం యోగి

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన తండ్రిని కడసారి చూపు చూడలేకపోయారు. యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిష్ట్ సోమవారం కన్నుమూశారు. ఆయన వయసు 89 యేళ్లు. ఈయన అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ చనిపోయారు. దేశవ్యాప్తంగా కరోనా లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో తండ్రి అంత్యక్రియల్లో సీఎం యోగి పాల్గొనలేకపోయారు. 
 
ఈ వార్త అందిన వెంటనే సీఎం యోగి స్పందించారు. తన తండ్రి మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, మంగళవారం నిర్వహించనున్న తన తండ్రి అంతిమసంస్కారాలకు తాను హాజరు కాలేకపోతున్నానని, 'కరోనా' కట్టడికి చేస్తున్న పోరాటం నేపథ్యంలోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. 
 
తన తండ్రి మరణవార్త విని చాలా బాధపడ్డానని అన్నారు. నమ్మకంగా ఉండటం, కష్టపడడం, నిస్వార్థంగా ఉండటం గురించి తన తండ్రి తనకు ఎప్పుడూ చెబుతుండేవారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యోగి గుర్తు చేసుకున్నారు. తన తండ్రి చివరి క్షణాల్లో ఆయనతో గడుపుదామనుకున్నాను కానీ, రాష్ట్రంలోని 23 కోట్ల మంది ప్రజలను రక్షించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. 
 
కాగా, ఉత్తరాఖండ్‌లోని పౌరి జిల్లాలోని స్వగ్రామానికి ఆనంద్ సింగ్ బిష్ట్ భౌతిక కాయాన్ని తరలించనున్నారు. మంగళవారం తన తండ్రి అంత్యక్రియలకు హాజరుకానున్న తన తల్లి, బంధువులు లాక్‌డౌన్ నిబంధనలను పాటించాలని కోరారు. లాక్ డౌన్ ముగిసిన తర్వాత తాను అక్కడికి వెళతానని చెప్పారు.