శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 12 మార్చి 2019 (20:27 IST)

రొయ్యల కిచిడీ ఎలా చేయాలో తెలుసా?

మాంసాహార ప్రియులు పచ్చి రొయ్యలు అంటే ఇష్టపడని వారుండరు. పచ్చి రొయ్యలను కూరలాగా కాకుండా రొయ్యల కిచిడీని చేసుకుని వేడివేడిగా తింటే ఆ మజానే వేరు. రొయ్యలు రుచిలోనే కాదండోయ్, ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. వీటిలో ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ వుండటంతో అవి గుండె రక్త నాళాల్లో పూడికలను రానివ్వవు. ఫలితంగా రక్తసరఫరా సాఫీగా సాగుతుంది. పళ్లు, ఎముకలు 
 
బలవర్థకంగా వుండేందుకు క్యాల్షియం అవసరం. రొయ్యల్లో ఈ క్యాల్షియం పుష్కలంగా వుంటుంది. అలాగే విటమిన్ ఇ, బి 12లు కూడా ఇందులో వున్నాయి. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న రొయ్యలతో కిచిడీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.
 
కావాల్సిన పదార్థాలు
రొయ్యలు - ఒక కప్పు,
బియ్యం - రెండు కప్పులు, 
ఉల్లిపాయల తరుగు - అరకప్పు,
పసుపు - అరచెంచా, 
సాంబార్ పొడి - చెంచా,
పచ్చిమిర్చి తరుగు - చెంచా, 
అల్లం వెల్లుల్లి పేస్టు - చెంచా,
ఉప్పు - తగినంత, 
కరివేపాకు రెబ్బలు - రెండు,
టొమాటో - ఒకటి,
బంగాళా దుంప - ఒకటి,
కొబ్బరి తురుము - రెండు చెంచాలు,
నానబెట్టిన పెసరపప్పు - టేబుల్ స్పూను,
మినప్పప్పు - టేబుల్ స్పూను, 
నెయ్యి - మూడు టేబుల్ స్పూన్లు,
నూనె- రెండు టేబుల్ స్పూన్లు.
 
తయారుచేసే విధానం:
బియ్యం కడిగి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టి నెయ్యి, నూనె వేయాలి. అది వేడెక్కాక ఉల్లిపాయ తరుగు వేసి వేయించాలి. అనంతరం పచ్చిమిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద వేయించాలి. అవి వేగాక టోమాటో ముక్కలు, బంగాళాదుంప ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. 
 
అవి వేగాక కొబ్బరి తురుము, రొయ్యలు వేయాలి. రొయ్యలు కాసేపు వేగాక బియ్యం, పెసరపప్పు, మినపప్పు వేసి కలపాలి. అలాగే చిటికెడు పసుపు, సాంబార్ పొడి, తగినంత ఉప్పు వేసి కలపాలి. బాగా కలిపాక నాలుగున్నర కప్పుల నీళ్లు వేసి కలిపి మూత పెట్టేయాలి. మూడు విజిల్స్ వచ్చాక దించేస్తే మీకెంతో ఇష్టమైన రొయ్యల కిచిడీ సిద్ధం.