గురువారం, 28 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Modified: బుధవారం, 26 డిశెంబరు 2018 (20:43 IST)

2019 శ్రీ వికారి నామ సంవత్సర పీఠికా ఫలమ్... ఎలా వుందంటే?

ఈ సంవత్సరం గ్రహస్థితిని గమనించగా నవంబర్ 4వ తేదీ వరకు వృశ్చికం నందు బృహస్పతి. ఆ తదుపరి అంతా ధనస్సు నందు, మిథునం నందు రాహువు, ధనస్సు నందు కేతువు, 2020 ఫిబ్రవరి వరకు ధనస్సు నందు శని, ఆ తదుపరి మకరం నందు సంచరిస్తారు. ఈ గోచారాన్ని గమనించగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆశించినంత అభివృద్ధి ఉండదు. రాజకీయనాయకులు ఊహాగానాల్లో విహరిస్తారు. రోడ్డు ప్రమాదాలు అధికమవుతాయి. స్త్రీల బలవన్మరణాలు అధికమవుతాయి. నిత్యావసర వస్తువులు ధరలు కొంత అధికం కాగలవు. 
 
ఆర్థికంగా మన రాష్ట్రం కొంత అభివృద్ధి పొందుతారు. కొత్తకొత్త వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆగష్టు వరకు అధిక ఎండలు ఉన్నందువలన ప్రతివారు ఇబ్బందులకు లోనవుతారు. మే, జూలైలో ఆకస్మిక వర్షాల వలన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు. వైద్యలకు చేతి నిండా పనిభారం పెరుగుతుంది. కొత్తకొత్త పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి చేరువవుతాయి. ఇతరుల ప్రభావం వలన తెలుగు రాష్ట్రాల వారు సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. 
 
విదేశాలు వెళ్లేవారు అనుకోని ఇబ్బందులు ఎదుర్కుంటారు. వివాహ విషయాల్లో సంతృప్తి కానరాదు. కంది, మినుము, మిర్చి, ప్రత్తి ధరలు అధికం కాగలవు. కేంద్ర, రాష్ట్ర నాయకుల మధ్య విభేదాలు అధికం కాగలవు. రియల్ ఎస్టేట్ రంగాల్లో వారికి కొంత అభివృద్ధి కానవస్తుంది. పురుష సంతతి అధికం కాగలదు. మెట్ట భూములు బాగుగా పండుతాయి. ఆగష్టు, సెప్టెంబర్, నవంబర్ ప్రాంతాల్లో అధిక వర్షాలు కురవడం వలన లోతట్టు ప్రాంతాల వారు ఇబ్బందులకు గురికావలసి వస్తుంది. న్యాయ స్థానాలు, దేవాలయ కార్యక్రమాల్లో తలదూర్చడం వలన ప్రజల్లో వ్యతిరేకభావం అధికమవుతుంది. మతపరమైన సమస్యలు చోటుచేసుకునే ఆస్కారం ఉంది. 
 
పండ్ల, పూల, కొబ్బరి వ్యాపారస్తులకు బాగుగా అభివృద్ధి కానరాగలదు. బంగారు, వెండి, లోహ స్టాకిస్టులకు ఈ సంవత్సరం ఎంతో కలిసివస్తుంది. సిమెంటు, కలప, ఇటుక వ్యాపారస్తులకు ఆశాజనకంగా ఉండగలదు. కాంట్రాక్టర్లు పనివారితో ఇబ్బందులు ఎదుర్కుంటారు. ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన అధికమవుతుంది. స్వామిజీలు, అధికారులు, వైద్యులు మాటపడతారు. నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. పురుషులకన్నా స్త్రీలు బాగుగా అభివృద్ధి చెందుతారు. కేసీఆర్ పాలనకు మంచి గుర్తింపు లభిస్తుంది. అనుకున్నది సాధించగలుగుతారు. దక్షిణం వైపు నుండి తుఫానులు అధికమవడం వలన ప్రజలు ఇబ్బందులకు లోనవుతారు. 
 
సినిమా కళాకారులకు మంచి గుర్తింపు లభిస్తుంది. రక్షక భటులకు, ఇన్‌కమ్‌టాక్స్ వారికి సమస్యలు అధికమవుతాయి. ఎలక్ట్రానిక్ రంగాల పట్ల విద్యార్థులకు ఆసక్తి పెరుగుతుంది. కుటుంబీకుల మధ్య పరస్పర అవగాహన లోపం అధికమవుతుంది. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. ప్రైవేటు సంస్థల్లో వారికి ఆశాజనకంగా ఉండగలదు. కొత్తకొత్త ఒడంబడికలు చేసుకుంటారు. మీడియా రంగాల్లో వారికి అనుకోని ఎదురుదెబ్బలు తగులుతాయి.

నూతన వాహనాలు విదేశాల నుండి దిగుబడి కాగలవు. కిడ్నీ, చక్కెరవ్యాధి, చర్మానికి సంబంధించిన కొత్త వ్యాధులు, అనారోగ్యాలు అధికం కాగలవు. మొత్తంమీద ఈ సంవత్సరం అంతా సామాన్యంగా ఉంటుంది. ప్రతివారు లక్ష్మీగణపతిని ఆరాధించడం వలన ధన్వంతరీ దేవతను ఆరాధించడం వలన సర్వదా శుభం కలుగుతుంది. తెనాలి వద్ద చిలువూరులో శ్రీ సీతారాముల చేత ప్రతిష్టింపబడిన సైకత లింగం దర్శించి, అభిషేకించిన సర్వదా పురోభివృద్ధి కానరాగలదు.