1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సందీప్
Last Updated : మంగళవారం, 2 జులై 2019 (18:37 IST)

వెంకన్నను దర్శించుకున్నాక.. శ్రీ కాళహస్తికి ఎందుకు వెళ్ళాలో తెలుసా?

శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలకు వెళ్లే భక్తులు దర్శనం అనంతరం తిరుమల దగ్గర్లో ఉన్న అన్ని దేవాలయాలు దర్శించుకుంటారు. పాపవినాశనం, కాణిపాకంతో పాటు చివరిగా శ్రీకాళహస్తిని దర్శించుకోవడం సాధారణం. శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న తర్వాత మరే దేవాలయానికి వెళ్లకూడదని చెబుతారు. 
 
ఒకవేళ వెళితే అరిష్టం అనే ఆచారం హిందు సాంప్రదాయాలలో అనాది నుండి వస్తోంది. అసలు ఎందుకు అలా చేయాలి, కాళహస్తీశ్వరుడిని దర్శించుకోవడంలో ఆంతర్యం ఏమిటి, ఆ ఆలయానికి వెళ్లిన తర్వాత మరే గుడికి ఎందుకు వెళ్లకూడదు. ఇలాంటి సందేహాలు రావడం అందరికీ సహజం. ఈ విశ్వం పంచభూతాల నిలయం. 
 
పంచభూతాలు అంటే గాలి, నింగి, నేల, నీరు, నిప్పు. వీటికి ప్రతితగా భూమి మీద పంచభూతలింగాలు వెలశాయి. అందులో ఒకటి చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వెలసిన వాయులింగం. అయితే ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇతర దేవాలయాలకు వెళ్లకూడదు అనే ఆచారం ఉంది. అందులో నిజం లేకపోలేదు. సర్పదోషం, రాహుకేతువుల దోషం ఇక్కడికి వచ్చాక పూర్తిగా నయమవుతుంది. 
 
శ్రీకాళహస్తిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనంతో సర్పదోషం తొలుగుతుంది, ప్రత్యేక పూజలు చేసుకున్న తర్వాత నేరుగా ఇంటికే వెళ్ళమని చెబుతారు. ఇక్కడి పూజల వలన దోష నివారణ జరగాలంటే శ్రీకాళహస్తిలో పాపాలు వదిలేసి ఇంటికి వెళ్ళాలి, తిరిగి ఇతర దేవాలయాలకు కానీ లేదా మరెక్కడికైనా వెళ్ళినా దోష నివారణ ఉండదనేది ప్రతీతి. 
 
అలాగే గ్రహణాలు పరమశివుడికి ఉండవని మిగతా అందరి దేవుళ్ళకి శని ప్రభావం, గ్రహణ ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. దీనికి నిదర్శనంగా చంద్రగ్రహణం రోజున గ్రహణ సమయంలో శ్రీకాళహస్తి దేవాలయం మాత్రం తెరిచే ఉంటుంది. ఈ సమయంలో కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం సహా అన్ని దేవాలయాలు మూసివేస్తారు, గ్రహణానంతరం శుద్ధి జరిపిన తర్వాత పూజలు నిర్వహిస్తారు. 
 
అందుకే ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఇక దైవదర్శనం అవసరం లేదని నీతి. భక్తులందరూ ఏడాదిలో ఒక్కసారైనా శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి అక్కడ రాహుకేతు పూజలు చేయించుకుని అక్కడ ఉన్న స్వామివారిని దర్శనం చేసుకోవడం వల్ల జీవితంలో వచ్చే అనేక ఒడిదుడుకులు నుండి గట్టెక్కవచ్చని పండితులు చెబుతుంటారు.