శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By Selvi
Last Updated : మంగళవారం, 11 నవంబరు 2014 (14:18 IST)

సుచీంద్రం హనుమంతుడి తోకకు వెన్నపూస రాస్తారెందుకు?

తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి జిల్లాలో'సుచీంద్రం'లో కనిపిస్తుంది. త్రిమూర్తులు ఒకే లింగరూపంలో ఆవిర్భవించడం ఈ క్షేత్రం ప్రత్యేకత. లింగం పైభాగాన విష్ణుమూర్తి మధ్యభాగంలో శివుడు  క్రిందిభాగంలో బ్రహ్మదేవుడు ఉన్నారని స్థలపురాణం చెబుతోంది. అహల్య విషయంలో గౌతమమహర్షి శాపానికి గురైన దేవేంద్రుడు, ఇక్కడి త్రిమూర్తులను ఆశ్రయించి శాపవిమోచనాన్ని పొందాడని అంటారు.
 
ఇంతటి మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో 18 అడుగుల హనుమంతుడి విగ్రహం కొలువై ఉంటుంది. ఇంతటి భారీ రూపాన్ని కొంచెం దూరం నుంచే పూర్తిగా చూడగలుగుతాం. సాధారణంగా హనుమంతుడి అనుగ్రహాన్ని పొందాలనుకునే వాళ్లు ఆయనకి సిందూర అభిషేకం చేయిస్తుంటారు. కానీ అందుకు భిన్నంగా ఈ క్షేత్రంలో స్వామివారి తోకకు స్వయంగా 'వెన్నపూస' రాస్తుంటారు.
 
ఈ ఆచారం రామాయణ కాలంతో ముడిపడివుందని ఇక్కడి వాళ్లు చెబుతుంటారు. సీతాన్వేషణ చేస్తూ లంకా నగరంలో అడుగుపెట్టిన హనుమంతుడు, కావాలనే రావణ సైన్యానికి పట్టుబడతాడు. రావణుడి ఆదేశం మేరకు ఆయన సైనికులు హనుమంతుడి తోకకు నిప్పుపెడతారు. ఆ సంఘటనని తనకి అనుకూలంగా మార్చుకున్న హనుమంతుడు తన తోకకి గల మంటను అక్కడి భవనాలకు అంటించి వాళ్లని భయభ్రాంతులకు గురిచేస్తాడు.
 
ఆ సంఘటనలో హనుమంతుడి తోక చాలావరకూ కాలిపోతుంది. ఆ బాధ నుంచి ఆయనకి ఉపశమనం కలగాలనే ఉద్దేశంతోనే ఇక్కడి స్వామి తోకకి 'వెన్నపూస' రాస్తున్నట్టుగా చెబుతారు. తరతరాలుగా వస్తోన్న ఈ ఆచారం వెనుక గల అర్థం ఇదేనని అంటారు. ఈ విధంగా హనుమంతుడి తోకకి వెన్నపూస రాస్తూ ఆయనకి ఉపశమనం కలిగించడం వలన, ఆ స్వామి ఆయురారోగ్యాలను ... అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడని భక్తులు విశ్వసిస్తారు.