గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 1 ఏప్రియల్ 2019 (12:55 IST)

ఏంటి? శ్రీవారి హుండీలో ఒక్క రూపాయ్ కూడా వేయకూడదా? చెప్పిందెవరు?

ఏంటి? శ్రీవారి హుండీలో ఒక్క రూపాయ్ కూడా వేయకూడదా? చెప్పిందెవరు? అంటున్నారు.. శ్రీవారి భక్తులు.. శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకుడిగా పనిచేసిన రమణ దీక్షితులు మాత్రం శ్రీవారి ఆలయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి భక్తుల ఆగ్రహానికి గురయ్యారు. 
 
ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన రమణ దీక్షితులు మాట్లాడుతూ.. హుండీలో స్వామికి ఒక్క రూపాయి కూడా వేయకండని చెప్పారు. హుండీ ఆదాయం రోజుకు రూ. 2 కోట్ల రూపాయల నుంచి 3కోట్ల రూపాయల వరకు వస్తోంది. స్వామివారి సేవకు అందులోంచి ఒక్క రూపాయి కూడా వినియోగించట్లేదన్నారు. 
 
పుష్పాలు, వస్త్రాలు, అలంకరణలు, ఉత్సవాలన్నింటినీ దాతల సహకారంతోనే చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఫలితంగా హుండీ ఆదాయాన్ని స్వామివారికి ఖర్చుచేసే అవసరం రాకపోవడంతో అది పాపకార్యాలకు వినియోగించే అవకాశం ఉంది. అందుకే భక్తులు కానుకలు హుండీలో వేయడం కంటే ధూపదీపాల్లేని ఆలయాల అర్చకుల జీతాలకు, నైవేద్యాలకు విరాళాలు ఇస్తే.. పుణ్యం వస్తుందని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. 
 
శ్రీవారి ఆలయంపై విషం చిమ్మితే స్వామివారు మిమ్మల్ని క్షమించరంటూ హెచ్చరిస్తున్నారు. దశాబ్దాలుగా శ్రీవారి సేవలో తరించిన మీరు.. అర్చక పదవి పోగానే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు.