శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 24 ఫిబ్రవరి 2019 (17:07 IST)

శ్రీవారికి సమర్పించే నైవేద్యాన్ని ఎవ్వరూ చూడరట..

తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వేంకటేశ్వర స్వామికి నైవేద్యంగా సమర్పించే ఆహార పదార్థాలను గురించి తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే. వెంకన్నకు అన్ని వేళలా లడ్డూలే కాకుండా.. ఆయనకు ఇష్టమైన పొంగలి, దోసెలు వంటివి కూడా సమర్పిస్తారు.
 
ఇవన్నీ కూడా ఆగమశాస్త్రం ప్రకారమే నైవేద్యాన్ని సమర్పిస్తారు. చక్కెర పొంగళి, పెరుగన్నం ప్రసాదాలూ స్వామి వారికి సమర్పిస్తారు. రుతువును బట్టి మూడు పూటల స్వామి వారికి నైవేద్యం సమర్పిస్తారు. ఆగమ శాస్త్రం ప్రకారమే తిరుమలలో ప్రసాదాల తయారీ, సమర్పణ జరుగుతుంది.
 
ప్రసాదాల తయారీ కోసం మామిడి, అశ్వత్థ, పలాస వృక్షాల ఎండు కొమ్మలనే ఉపయోగిస్తారు. పాలుగారే చెట్ల కొమ్మలు, ముళ్ల చెట్లుగానీ వంటకు వినియోగించరు. ప్రసాదం వండేవారు వంట సమయంలోగానీ, తర్వాతగానీ వాసన చూడరు. 
 
వాసన సోకకుండా ముక్కు, నోటికీ అడ్డుగా వస్త్రం పెట్టుకుంటారు. శ్రీవారికి సమర్పించేంతవరకు ఆ ప్రసాదాన్ని ఎవ్వరూ చూడకూడదు. ప్రసాదం సమర్పించడానికి ముందు గర్భాలయాన్ని నీళ్ళతో శుద్ధి చేస్తారు. గాయత్రీ మంత్రం జపిస్తూ నీళ్లు చల్లుతారు. వండిన ప్రసాదాలను మూత పెట్టిన గంగాళాల్లో దేవుడి ముందు  ఉంచుతారు.
 
స్వామి, ప్రసాదాలు, నైవేద్యం సమర్పించే అర్చకుడు మాత్రమే గర్భగుడిలో ఉంటారు. గర్భాలయం తలుపులు మూసేస్తారు. విష్ణు గాయత్రి మంత్రం పఠిస్తూ అర్చకుడు ప్రసాదాల మీద నెయ్యి, తులసి ఆకులు చల్లుతారు.
కుడిచేతి గ్రాసముద్రతో ప్రసాదాన్ని తాకిన అర్చకుడు స్వామి కుడి చేతికి దానిని తాకించి, నోటి దగ్గర తాకుతారు. నైవేద్యం సమర్పించేంత వరకూ ఆలయంలో గంట మోగుతూనే ఉంటుంది. ఇది స్వామికి భోజనానికి పిలుపుగా దీనిని భావిస్తారు.
 
రోజుకు మూడు పూటలా స్వామికి నైవేద్యం సమర్పిస్తారు. నైవేద్యం సమర్పించిన తర్వాత భక్తులకు దీనిని పంచుతారు. ఉదయం మాత్రాన్నం, నేతి పొంగలి, పులిహోర, దద్యోజనం, చక్కెర పొంగలి, శకాన్నం, రవ్వ కేసరి, మధ్యాహ్నం శుద్ధాన్నం, పులిహోర, గూడాన్నం, దద్యోజనం, శీర లేక చక్కెరన్నం.. రాత్రిపూట మిరియాల అన్నం, దోసె, లడ్డూ, వడ, శాకాన్నం సమర్పిస్తారు.